‘విశ్వంభర’కు.. తలదించుకొని పనిచేస్తున్నాం
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:47 AM
ఛాయాగ్రాహకుడు ఛోటా కె నాయుడు మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘విశ్వంభర’ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
‘వదలా’ (vadhala) చిత్రం గ్లింప్స్ వేడుకలో ఛాయాగ్రాహకుడు ఛోటా కె నాయుడు (Chota K Naidu) మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘విశ్వంభర’ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఈ రోజుల్లో గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.
అలాంటి సినిమాల జయాపజయాల వెనుక కెమెరామెన్ పాత్ర ఏ మాత్రం ఉండదు. సీజీ టీమ్ చెప్పినట్లు చేయకపోతే ఏ చిన్న తేడా వచ్చినా, కెమెరామెన్ మీద తప్పు నెడతారు. అందుకే దర్శకుడు, వీఎఫ్ఎక్స్ టీమ్ చెప్పినట్లు చేసుకుంటూ వెళ్లిపోతాం.
సీజీ వర్క్ కుదరకపోతే సినిమాటోగ్రాఫర్ను బాధ్యుణ్ణి చేయడం సరికాదు’ అని అంటూ ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రం విషయం ప్రస్తావించి అంజి (Anji) సినిమాకు తలెత్తుకొని పనిచేశాం. ‘విశ్వంభర’ కోసం తలదించుకొని పనిచేస్తున్నాం.
ఎందుకంటే ఆ సినిమాకు సీజీ వర్క్ చాలా ఎక్కువ. నేను ఛోటా కే. నాయుడుని, నాకు చాలా తెలుసు అంటే కుదరదు. ఆ సినిమా బడ్జెట్ రూ. 400 కోట్లు. నా ఇగో చూపిస్తే వర్కౌట్ అవదు. అందుకే టైమ్ తీసుకుంటున్నాం. ‘విశ్వంభర’ గొప్ప చిత్రం అవుతుంది’ అని అన్నారు.