మెగా 158 పూజ.. బండ్ల గణేష్ ఈరోజు నిద్రపోడేమో
ABN , Publish Date - May 21 , 2026 | 03:03 PM
చిరంజీవి హీరోగా 158వ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా 158వ చిత్రం గురువారం మొదలైంది. కె.ఎస్.రవీంద్ర (బాబీ కొల్లి) దర్శకత్వంలో కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై కె. నారాయణ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ క్లాప్ కొట్టారు. చిరంజీవి కుమార్తె సుస్మిత కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి.
అన్నపూర్ణ స్టూడియోకు చిరంజీవి, తన సోదరుడు పవన్కల్యాణ్ ఒకే కారులో వచ్చారు. తదుపరి నాగబాబు జాయిన్ అయ్యారు. ముగ్గురు కలిసి ఒకే సోఫాలో కూర్చుని చక్కగా ముచ్చటించుకున్నారు. చిరంజీవి పక్కన ఉన్నంత సేపు పవన్ ఎంతో వినయంగా ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసి అభిమానులు సంబరపడిపోయారు. చాలాకాలం తర్వాత ముగ్గురు సోదరులను ఒకే వేదికపై చూడటం కనుల విందుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్చరణ్ ఫొటోలను చిత్రించిన పట్టు శాలువాతో చిరంజీవిని సన్మానించింది చిత్ర బృందం.
బండ్ల భుజంపై చెయ్యేసి..
మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. పవన్కల్యాణ్కి భక్తుడైన బండ్ల గణేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బండ్లను చూడగానే పవన్ దగ్గరకు తీసుకుని భుజంపై చేయి వేసి మాట్లాడుతూ లోపలికి తీసుకెళ్లారు. ఆ కాసేపు బండ్ల మొహం హై వోల్టేజ్ బల్బ్లా వెలిగిపోయింది. ఎప్పటిలాగే వినయంగా చేతులు కట్టుకుని మాట్లాడారు బండ్ల గణేశ్. చిరంజీవి సైతం బండ్లను హత్తుకున్నారు. అభిమానులు మాత్రం ‘బండ్లన్నకు ఇవాళ పండగే.. ఆయన అభిమానించే హీరోలతో సరదాగా కాసేపు ముచ్చటించారు. ఈ రోజు ఆయనకు నిద్ర పట్టదేమో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి అనశ్వర రాజన్ కూడా హాజరయ్యారు. ఈ చిత్రంలో ఆమె చిరుకు కుమార్తెగా కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది.