బాలకృష్ణ హీరోగా.. వశిష్ఠ డైరెక్షన్‌లో దిల్ రాజు సినిమా!

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:50 PM

నటసింహ బాలకృష్ణ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తారని చాలా రోజులుగా వినిపిస్తోంది... ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ కూడా సెట్ అయినట్టు సమాచారం... ఇంతకూ ఎవరో ఆ లక్కీ గై ?

Balakrishna - Dil Raju - Vasishta

బాలకృష్ణ (Balakrishna) హీరోగా రూపొందిన అనేక చిత్రాలను నైజామ్, వైజాగ్ ఏరియాల్లో పంపిణీ చేశారు దిల్ రాజు (Dil Raju). తెలుగు చిత్రసీమలో ప్రముఖునిగా నిలచిన దిల్ రాజు ప్రస్తుతం తెలంగాణ చలనచిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్ గానూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు నిర్మించే చిత్రాలపై సినీ ఫ్యాన్స్ లోనూ విశేషమైన చర్చ సాగుతూ ఉంటుంది. చాలా రోజులుగా బాలయ్యతో దిల్ రాజు ఓ సినిమా నిర్మిస్తారని వినిపిస్తోంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించే లక్కీ పర్సన్ ఎవరూ అంటూ కూడా డిస్కషన్స్ సాగాయి. ఉన్నట్టుండి ఇప్పుడు 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ పేరు వినిపిస్తోంది. డైరెక్టర్ గా తొలి సినిమా 'బింబిసార' (Bimbisara) తోనే తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు వశిష్ఠ (Vashista). అతనిలోని ప్రతిభను గమనించే చిరంజీవి (Chiranjeevi) సైతం వశిష్ఠ దర్శకత్వంలో 'విశ్వంభర' (Viswambhara) సినిమాలో నటించారు. 'విశ్వంభర' త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే మరో టాప్ స్టార్ బాలయ్యతో వశిష్ఠ పనిచేయబోవడం విశేషంగా మారింది.


ప్రస్తుతం బాలకృష్ణ... గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని వేగంగా పూర్తిచేసి, దసరా కానుకగా రిలీజ్ చేస్తారని సమాచారం. రాబోయే సంక్రాంతి సీజన్ లోనూ బాలకృష్ణ మూవీ ఒకటి రిలీజ్ అవుతుందనీ అంటున్నారు. అందులో భాగంగానే బాలయ్యతో దిల్ రాజు నిర్మించే చిత్రం ఉంటుందనీ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 2027 పొంగల్ బరిలో చిరంజీవి- బాబీ సినిమా, వెంకటేశ్ - అనిల్ రావిపూడి పిక్చర్, నాగార్జున - కళ్యాణ్ కృష్ణ మూవీ దూకుతాయని తెలుస్తోంది. బాలకృష్ణ సినిమా కూడా అదే సీజన్ లో వస్తుందని వినిపించింది. ఇప్పుడు బాలయ్యతో వశిష్ఠ డైరెక్షన్ లో దిల్ రాజు తీయబోయే సినిమానే సంక్రాంతి కానుకగా రానుందని సమాచారం.


ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు కల్పించడానికి నందమూరి కళ్యాణ్ రామ్ ఆసక్తి చూపిస్తూంటారు. కళ్యాణ్ రామ్ నటించి, నిర్మించిన చిత్రాల ద్వారా పరిచయమైన సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి వంటివారు దర్శకులుగా తమదైన బాణీ పలికిస్తున్నారు. కళ్యాణ్ రామ్ 'బింబిసార'తో దర్శకుడైన వశిష్ఠ కూడా వరుసగా మెగాస్టార్, నటసింహ సినిమాలకు దర్శకత్వం వహించడం మరింత విశేషం కానుంది. ఈ యేడాది వశిష్ఠ తన రెండో సినిమా 'విశ్వంభర'తో ఎలా అలరిస్తారో? తరువాత బాలయ్య మూవీని ఏ తీరున తెరకెక్కిస్తారో? అన్న ఆసక్తి కూడా సినీ ఫ్యాన్స్ లో కలుగుతోంది. బాలయ్య - దిల్ రాజు కాంబో సినిమా అంటేనే ఓ స్పెషల్ - అలాంటి సినిమాకు వశిష్ఠ డైరెక్టర్ కావడం మరో విశేషం. అందువల్ల ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో అమితాసక్తి కలుగుతోంది. మరి ఫ్యాన్స్ ను ఈ మూవీ ఎలా మురిపిస్తుందో చూడాలి.

Updated Date - Feb 18 , 2026 | 08:42 PM