బాలయ్య vs నాగార్జున.. ఎవరు గెలుస్తారో?
ABN , Publish Date - Aug 30 , 2026 | 02:59 PM
బాక్సాఫీస్ వద్ద ఒకే తేదీన సినిమాలు పోటీపడటం కొత్తేమీ కాదు. కానీ ఒకే రోజు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే అభిమానులకు పండగే అని చెప్పాలి.
బాక్సాఫీస్ వద్ద ఒకే తేదీన సినిమాలు పోటీపడటం కొత్తేమీ కాదు. కానీ ఒకే రోజు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే అభిమానులకు పండగే అని చెప్పాలి. అలాంటి భారీ బాక్సాఫీస్ రేసుకే రాబోయే క్రిస్మస్ సీజన్ వేదిక కాబోతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పటికే ఎన్నో క్రేజీ క్లాష్లు చూశాం. కానీ చాలా రోజుల తర్వాత ఒకే రోజున థియేటర్లలోకి వచ్చేందుకు ఇద్దరు దిగ్గజ హీరోలు సిద్ధమవుతున్నారు. వారే నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni).
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో 'NBK111' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'వీరసింహారెడ్డి' బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఈ ప్రాజెక్ట్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని దసరా బరిలో దించాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ సమయంలో బాలయ్యకు గాయం కావడంతో ప్రాజెక్ట్ కొద్దిగా జాప్యమైంది. దీంతో ఈ మాస్ ధమాకాను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు, అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం ‘కింగ్ 100’ను కూడా అదే డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రా. కార్తీక్ (Ra Karthik) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైలురాయి చిత్రంపై అక్కినేని అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సొంత బ్యానర్లో ఎంతో గ్రాండ్గా తెరకెక్కుతున్న ఈ 100వ సినిమాను కూడా క్రిస్మస్ రేసులోనే నిలపాలని ప్లాన్ చేయడంతో.. బాలయ్య, నాగ్ సినిమాల మధ్య నేరుగా బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడింది. అంతేకాదు, ఈ టాలీవుడ్ వార్కి తోడుగా బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమా కూడా అదే క్రిస్మస్ సీజన్ను టార్గెట్ చేస్తోందని టాక్. షారుఖ్ ఖాన్కు తెలుగులో క్రేజ్ ఉన్నప్పటికీ, బాలయ్య-నాగార్జున నేరుగా పోటీ పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వీరి ప్రాజెక్టుల పైనే అందరి దృష్టి.
అయితే ఈ బాక్సాఫీస్ పోరులో అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న అసలు ముప్పు హాలీవుడ్ నుంచి వస్తోంది. మార్వెల్ స్టూడియోస్కి చెందిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అవెంజర్స్: డూమ్స్డే’ డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మార్వెల్ సినిమాలకు ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల 'ది ఒడిస్సీ', 'స్పైడర్ మ్యాన్' వంటి సినిమాలు మన ప్రాంతీయ సినిమాలకు పోటీగా నిలిచి బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించాయి. ఈ పరిస్థితుల్లో 'అవెంజర్స్' ప్రభావం ఉంటే క్రిస్మస్ వారంలో స్క్రీన్ల కోసం పోటీ మరీ తీవ్రంగా మారే అవకాశం ఉంది. మరి ఈ ఊహించని డిసెంబర్ 24 క్లాష్ను బాలయ్య, నాగార్జున ఇద్దరూ కొనసాగిస్తారా? లేక రిస్క్ ఎందుకు అని భావించి చివరి నిమిషంలో ఎవరైనా వెనక్కి తగ్గుతారా? అన్నది వేచి చూడాలి.