Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన గవర్నర్.. లైబ్రరీని చూసి ఫిదా
ABN , Publish Date - Jul 16 , 2026 | 01:54 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ (Andhra Pradesh Governor Abdul Nazeer) గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.

అనంతరం గవర్నర్ పవన్ కళ్యాణ్ నివాసంలోని వ్యక్తిగత లైబ్రరీని సందర్శించారు. అక్కడ ఉన్న పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. ప్రముఖ రచయితలు, చరిత్రకారులు, పబ్లిక్ పాలసీ నిపుణులు, సామాజిక విశ్లేషకులు రచించిన పుస్తకాల గురించి పవన్ కళ్యాణ్తో చర్చించారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థన మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఒక పుస్తకంపై తన సంతకం (ఆటోగ్రాఫ్) కూడా చేశారు. స్వయంగా నివాసానికి వచ్చి పరామర్శించిన గవర్నర్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ చూపిన ఆప్యాయత, అభిమానానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు.