Chiranjeevi: దర్శకులంతా.. పరిమిత బడ్జెట్‌లోనే సినిమాలు తీయాలి.

ABN , Publish Date - Aug 12 , 2026 | 06:57 AM

వరుణ్‌తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ‘కొరియన్‌ కనకరాజు’ విజయంపై మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. కంటెంట్‌ బలంగా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అన్నారు

Chiranjeevi

‘‘ఒక సినిమా విజయం ఎంతో మంది జీవితాల్లో ఆనందాన్నిస్తుంది. ‘కొరియన్‌ కనకరాజు’ (Korean Kanakaraju) సక్సెస్‌ ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్‌ చేసింది. ఈ సక్సెస్‌ క్రెడిట్‌ దర్శకుడు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi)కి దక్కుతుంది. వరుణ్‌తేజ్ (Varun Tej) ఈ సినిమా ద్వారా నటుడిగా గొప్ప వైవిధ్యం చూపించాడు. ఈ ద్వితీయార్థం ‘పెద్ది’ విజయంతో మొదలై.. ‘మా ఇంటి బంగారం’, ‘చెన్నై లవ్‌స్టోరీ’, ‘కొరియన్‌ కనకరాజు’తో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా పరిణామాన్ని నిర్దేశించేది బడ్జెట్‌ కాదు. కంటెంట్‌ మాత్రమే. కథ బలంగా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారు. ఇండస్ట్రీ కళకళలాడాలంటే దర్శకులంతా పరిమిత బడ్జెట్‌లోనే సినిమాలు తీయాలి. అలాగే నిర్మాతలకు, వారు పెట్టే ప్రతీ పైసాకు డైరెక్టర్‌ విలువ ఇవ్వాలి’ అని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అన్నారు.

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మాణంలో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’. ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌’లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘మెగా ఫ్యాన్స్‌కు మంచి సినిమా ఇవ్వాలనే నా ఆలోచన ఈ సినిమాతో నెరవేరినందుకు ఆనందంగా ఉంది’ అని వరుణ్‌తేజ్‌ చెప్పారు. ‘ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని నిర్మాత నాగబాబు తెలిపారు. ‘వరుణ్‌తేజ్‌, మేర్లపాక గాంధీ కష్టానికి దక్కిన గొప్ప ఫలితం ఈ విజయం’ అని దర్శకుడు క్రిష్‌ పేర్కొన్నారు. ‘వరుణ్‌ తేజ్‌ ఈ సినిమాకు ప్రతీ విషయంలో బ్యాక్‌బోన్‌గా నిలిచారు. ఆయనతో మరోసారి పనిచేయాలని కోరుకుంటున్నాను’ అని మేర్లపాక గాంధీ చెప్పారు.

Updated Date - Aug 12 , 2026 | 07:59 AM