మరకతమణి 2.. వచ్చేస్తోంది!
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:22 PM
దశాబ్దం క్రితం రూపుదిద్దుకుని, మంచి విజయాన్ని అందుకున్న ఆది పినిశెట్టి 'మరకతమణి' చిత్రానికి సీక్వెల్ రాబోతోంది.
దాదాపు దశాబ్దం క్రితం థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన చిత్రం మరగధ నానయం (Maragadha Naanayam). ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), నిక్కీ గల్రానీ (Nikki Galrani) జంటగా ఫాంటసీ కామెడీ జానర్లో వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల వారినీ అలరించి తమిళనాట క్లాసిక్ సినిమాల జాబితాలో చోటు సంపాదించుకుంది.
ఎ.ఆర్.కె. శరవణన్ రచించి దర్శకత్వం వహించిన ఈ సినిమాను మరకత మణి (Marakathamani) పేరుతో తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడా మంచి విజయం సాధించి తెలుగు ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం ఏర్పరుచుకుంది. అంతేగాక ఆల్టైం టాప్ టెన్ మస్ట్ వాచ్ చిత్రాల్లో ఈ సినిమాకు సౌత్ లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉండడం గమనార్హం.

అయితే.. ఇన్నాళ్లకు ఈ మూవీ సీక్వెల్ మరగధ నానయం 2 (Maragadha Naanayam2) తెర మీదకు వచ్చేందుకు సిద్ధమైంది. గత సినిమా దర్శకుడు ఎ.ఆర్.కె. శరవణన్ తెరకెక్కిస్తుండగా ఆది మరోసారి కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా సోమవారం ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కార్తి (Karthi), ఆర్య (Aarya) ముఖ్య అతిథులుగా విచ్చేసి క్లాప్ కొట్టి షూటింగ్ స్టార్ట్ చేశారు.
ఈ సినిమాలో నిక్కీ గల్రానీ మరోమారు తన భర్త ఆది సరసన నటిస్తోండగా కొత్తగా ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar) సైతం మరో కథానాయికగా నటిస్తుండటం విశేషం. ఈ నెలాఖరు నుంచి నిర్విరామంగా షూటింగ్ చేసి ఈ ఏడాది చివరలో సినిమాను ప్రేక్షకుల ఎదుటకు తీసుకు వచ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నారు.