Shakeela: నరకయాతన పడ్డాను.. అందుకే భద్రం
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:32 PM
ప్రముఖ నటి షకీల (Shakeela) తనకు ఎదురైన ఓ ఆరోగ్య సమస్య గురించి తాజాగా వెల్లడించారు.
ప్రముఖ నటి షకీల (Shakeela) తనకు ఎదురైన ఓ ఆరోగ్య సమస్య గురించి తాజాగా వెల్లడించారు. మొబైల్ ఫోన్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తీవ్రస్థాయిలో మెడ నొప్పి వచ్చిందని, చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. ఈ చికిత్స కోసం దాదాపు రూ.3 లక్షలు ఖర్చయినట్లు వెల్లడిస్తూ.. మొబైల్ వినియోగంపై అభిమానులకు కీలక సూచనలు చేశారు. "ఫోన్లో ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, యూట్యూబ్ వీడియోలు చూడటం, ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేయడం ఆమె దినచర్యలో భాగంగా మారిపోయింది. అంతేకాకుండా రాత్రి నిద్రించే సమయంలోనూ ఒకవైపు ఒరిగి గంటల తరబడి ఫోన్ చూస్తూ ఉండేదాన్ని. ఈ అలవాటు కారణంగా మెడపై, నరాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి సమస్య మరింత తీవ్రమైంది. మెడ నొప్పి భరించలేని స్థాయికి చేరుకోవడంతో వైద్యులను సంప్రదించగా.. శస్త్రచికిత్స అవసరమని సూచించారు. దీంతో సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేసి ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు ఎదురైన అనుభవాన్ని ఉదాహరణగా తీసుకొని మొబైల్ ఫోన్ వినియోగంలో ప్రతి ఒక్కరూ నియంత్రణ పాటించాలి'' అని ఆమె సూచించారు.
“ఫోన్ మన జీవితంలో అవసరమైన వస్తువే. కానీ దాన్ని అవసరానికి మించి ఉపయోగించకూడదు. ప్రయోజనం లేని వీడియోలు చూస్తూ గంటల తరబడి సమయాన్ని వృథా చేసుకోవద్దు. సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే డబ్బు, సమయం కోల్పోవడంతో పాటు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది” అని షకీల హెచ్చరించారు. చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. పిల్లలు ఎక్కువసేపు స్క్రీన్కు అలవాటు పడకుండా చూసుకోవాలని, కుటుంబ సభ్యులంతా మొబైల్ వినియోగాన్ని తగ్గించి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు.