'రాక్షసపురం' మరోసారి వాయిదా!
ABN , Publish Date - May 05 , 2026 | 04:59 PM
కన్నడ అనువాద చిత్రం 'రాక్షస పురం' మరోసారి వాయిదా పడింది. రాజ్ బి శెట్టి పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ సినిమాను మే 15న విడుదల చేయబోతున్నట్టు కె.ఎస్. రామారావు తెలిపారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె. ఎస్. రామారావు (K.S. Ramarao) తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షస పురం’ (Rakshasa Puram). ఈ చిత్రాన్ని కె.ఎన్. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కె. రవివర్మ కన్నడలో నిర్మించారు. రవి సారంగ దర్శకత్వం వహించారు. కన్నడలో విజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ చిత్రాన్ని తొలుత మే 1న విడుదల చేస్తామని కె. ఎస్. రామారావు తెలిపారు. ఆ తర్వాత మే 7కు వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశారు. మే 15న దీనిని జనం ముందుకు తీసుకు వస్తామని కె.ఎస్. రామారావు అన్నారు. కన్నడ చిత్రాల ద్వారా విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ బి శెట్టి (Raj B Shetty) ఈ మర్డర్ మిస్టరీ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రను పోషించాడు.
ప్రస్తుతం ఐపీఎల్ సందడి, ఓటీటీల పోటీ ఉన్నప్పటికీ, కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ‘రాక్షసపురం’ కచ్చితంగా ఆ కోవలోకి వస్తుందని కె. ఎస్. రామారావు ధీమా వ్యక్తం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ లతో పోటీ పడకుండా తమ చిత్రాన్ని మార్నింగ్, మ్యాట్నీ షోలలో ప్రదర్శించాల్సిందిగా ఎగ్జిబిటర్స్ కు తెలిపామని ఆయన అన్నారు. మరి ఇటీవల వచ్చిన కొన్ని కన్నడ చిత్రాలు తెలుగువారిని బాగానే ఆకట్టుకున్నాయి. అలానే రాజ్ బి శెట్టి కీలక పాత్ర పోషించిన 'సు ఫ్రమ్ సో' కూడా వినోదాల విందును పంచింది. మరి 'రాక్షసపురం' ఎలాంటి ఆదరణకు నోచుకుంటుందో చూడాలి.