అమెజాన్ ప్రైమ్లో కమల్, శ్రీదేవి 'మూండ్రామ్ పిఱై'!
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:46 AM
కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన 'వసంత కోకిల' చిత్రాన్ని ఎవరూ అంత తేలికగా మర్చిపోరు. ఆ సినిమా తమిళ మాతృక అయిన 'మూండ్రామ్ పిఱై'ను మే 1న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన 'మూండ్రామ్ పిఱై' తమిళ మూవీ ఓ క్లాసిక్. అది తెలుగులో 'వసంత కోకిల' పేరుతో డబ్ అయ్యి, ఇక్కడా ఘన విజయం సాధించింది. దీన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై టీజీ త్యాగరాజన్, జి. శరవణన్ నిర్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బాటు మహేంద్ర దీనికి, కథ, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం అందించారు. ఇళయ రాజా సంగీతం ఈ సినిమాకు ప్రాణం. గొప్ప మ్యూజికల్ హిట్గా ఈ సినిమా నిలవడానికి ఇళయరాజా స్వరాలే కారణం. సున్నితమైన కథనం, కవిత్వంలా కనిపించే విజువల్స్, మరపురాని క్లయిమాక్స్ ఈ మూవీని భారత సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలబెట్టాయి.
1982లో విడుదలైన ఈ చిత్రంలో కమల్ హాసన్ తన కెరీర్లోనే అత్యుత్తమ నటనను ప్రదర్శించగా, శ్రీదేవి తన కెరీర్కు మైలురాయిగా నిలిచే పాత్రను పోషించారు. వై. జీ. మహేంద్రన్, సిల్క్ స్మిత, పూర్ణం విశ్వనాథన్, గాంధిమతి తదితరులు సహాయ పాత్రల్లో కనిపించారు. 'మూండ్రామ్ పిఱై' చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులనూ సొంతం చేసుకుంది. కమల్ హాసన్కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు (తన తొలి నేషనల్ అవార్డు), బాలూ మహేంద్రకు ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు లభించాయి. అదేవిధంగా ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు సౌత్, పలు తమిళనాడు రాష్ట్ర అవార్డులు కూడా అందుకుంది. దేశవ్యాప్తంగా ఒక సంవత్సరం పాటు నిరంతర ప్రదర్శనతో విశేష విజయాన్ని నమోదు చేయడం ఈ చిత్ర ప్రత్యేకత.
దశాబ్దాల తర్వాత కూడా ఒక ఎవర్గ్రీన్ కల్ట్ క్లాసిక్గా నిలిచిన ఈ సినిమాను ఇప్పుడు డిజిటల్ రీస్టోరేషన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు అమెజాన్ ప్రైమ్ సంస్థ తీసుకురాబోతోంది. మే 1న డిజిటల్గా రీమాస్టర్ చేసిన దీనిని స్ట్రీమింగ్ చేయబోతున్నారు.