తండ్రి కోసం.. తనయుడి త్యాగం?
ABN , Publish Date - Jul 15 , 2026 | 10:20 AM
విజయ్ నటించిన 'జన నాయగన్' రిలీజ్కు లైన్ క్లియర్ కావడంతో జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సిగ్మా' విడుదల వాయిదా పడనున్నట్టు కోలీవుడ్లో ప్రచారం సాగుతోంది.
తన తండ్రి విజయ్ (Thalapathy Vijay) కోసం ఆయన కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) వెనక్కి తగ్గినట్టు కోలీవుడ్లో ప్రచారం సాగుతోంది. ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jana Nayagan) ఈ నెల 23 లేదా 24వ తేదీల్లో విడుదల కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు, విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతూ తీసిన తొలి చిత్రం ‘సిగ్మా’ (Sigma) ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
అయితే, సెన్సార్ వివాదంలో చిక్కుకున్న ‘జన నాయగన్’ మూవీకి తాజాగా రిలీజ్కు లైన్ క్లియర్ అయింది. దీంతో ఈ నెల 24న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ కారణంగా ఈ నెల 24వ తేదీన విడుదల కావాల్సిన అనేక చిన్న చిత్రాలు వాయిదాపడనున్నాయి. ఈ నేపథ్యంలో తమ చిత్రాన్ని కూడా జాసన్ సంజయ్ వాయిదా వేసుకున్నట్టు సమాచారం. అయితే, దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.