గాడ్ ఆఫ్ వార్ కాంట్రవర్సీ.. జూ. ఎన్టీఆర్ ఆ తప్పు చేయడు
ABN , Publish Date - Jul 06 , 2026 | 02:05 PM
'గాడ్ ఆఫ్ వార్' చిత్రంలో మురుగన్ ను ఉత్తరాదికి చెందిన వాడిగా చిత్రీకరించారని, ఆ చిత్రాన్ని తమిళనాట అడ్డుకుంటామని ఎన్డీకే అధినేత సీమాన్ చేసిన ప్రకటనను ద్రావిడ దేశం పార్టీ తీవ్రంగా ఖండించింది.
ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటాం
నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ హెచ్చరిక
జూనియర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం గాడ్ ఆఫ్ వార్ (God Of War) లో తమిళుల ఆరాధ్యదైవం మురుగన్ స్వామిని ఉత్తర భారతంలో జన్మించినట్లు చూపించే ప్రయత్నాలను తక్షణమే ఆపాలని, లేకుంటే తమిళనాట ఆ సినిమాను ఎక్కడా ప్రదర్శించకుండా అడ్డుకుంటామని నామ్ తమిళర్ కట్చి నేత, ప్రముఖ సినీ దర్శకుడు సీమాన్ (Seeman) హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన జారీ చేస్తూ. ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం జారీ చేసిన పోస్ట్లో మురుగప్పెరుమాన్ ఉత్తర భారతంలో జన్మించినట్లు పేర్కొనటం అవాస్తవమని అన్నారు.
ఆ.. వ్యాఖ్యలు అర్థరహితం
'డ్రాగన్' చిత్రంలో మురుగన్ ను ఉత్తరాదికి చెందిన వాడిగా చిత్రీకరించారని, అందువల్ల ఆ చిత్రాన్ని తమిళనాట అడ్డుకుంటామని ఎన్డీకే అధినేత సీమాన్ చేసిన ప్రకటనను ద్రావిడ దేశం పార్టీ (Dravida Desham Party) తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలు అర్థరహితమని స్పష్టం చేసింది. ఈ మేరకు ద్రావిడదేశం అధ్యక్షుడు కృష్ణారావు (Krishna Rao) ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తమిళ రాజకీయాల్లో క్రమంగా కనుమరుగవు తున్న సీమాన్ పలు సభల్లో తెలుగు వారిని తిడుతూ అవహేళన చేస్తూ ప్రసంగిస్తున్నారని కృష్ణారావు గుర్తు చేశారు.
ఎంతో అనుభవం గల సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ ఎక్కడా ఇతర భాషల సంస్కృతి, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా చిత్రీకరించలేదని, అలాగే ఇంతవరకు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలు ఆబాల గోపాలాన్ని అలరించాయే తప్ప ఎక్కడా విమర్శలకు తావు లేదన్నారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కథ వినేటప్పుడు అన్ని కోణాల్లో నిశితంగా పరిశీలించిన తరువాతే సినిమాలో నటించేందుకు సంతకం పెడతారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం విడుదల సమయంలో సీమాన్ ఏ విధంగానైనా ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ద్రావిడదేశం తరపున తీవ్రంగా ఎదుర్కొం టామని, తమిళనాట నివశిస్తున్న రెండు కోట్ల తెలుగువారి సత్తా ఏంటో చూపిస్తామని కృష్ణారావు హెచ్చరించారు..