హీరోయిన్గా.. దేవయాని కుమార్తె!
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:18 PM
'కోర్ట్' సినిమా తమిళంలో రీమేక్ అవుతోంది. త్యాగరాజన్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా ఆయన కొడుకు ప్రశాంత్ లాయర్ పాత్ర చేస్తున్నాడు. నటి దేవయాని కుమార్తె ప్రియాంక హీరోయిన్గా పరిచయం అవుతోంది.
గత యేడాది తెలుగులో వచ్చిన 'కోర్ట్' సినిమా సూపర్ హిట్ అయ్యింది. మినిమమ్ బడ్జెట్తో తెరకెక్కిన ఆ సినిమా ఏకంగా యాభై కోట్లకు పైగా గ్రాస్ను వసులూ చేసింది. హీరో నాని నిర్మించిన 'కోర్ట్' మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమాతో పరిచయం అయిన హర్ష్ రోషన్, శ్రీదేవికి పలు అవకాశాలు వచ్చాయి. వారిద్దరే జంటగా ఇటీవల 'బ్యాండ్ మేళం' సినిమా కూడా రూపుదిద్దుకుని విడుదలైంది. శివాజీ, రోహిణి, ప్రియదర్శి, సాయికుమార్, హర్షవర్థన్ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషించారు. మంగపతిగా నటించిన శివాజీకి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.
తాజాగా 'కోర్ట్' సినిమాను తమిళంలో 'రంజన్: ది అడ్వకేట్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. టైటిల్ రోల్ను ప్రముఖ నటుడు ప్రశాంత్ పోషించబోతున్నారు. ఈ సినిమాను ప్రశాంత్ తండ్రి, నట దర్శకుడు త్యాగరాజన్ డైరెక్ట్ చేస్తున్నారు. దీనిని ప్రముఖ నిర్మాత కతిరేసన్ నిర్మిస్తున్నారు. విశేషం ఏమంటే... ఈ సినిమాతో ఇద్దరు వారసులు అరంగేట్రమ్ చేస్తున్నారు. తెలుగులో శ్రీదేవి పోషించిన హీరోయిన్ పాత్రను తమిళంలో ప్రముఖ నటి దేవయాని కుమార్తె ప్రియాంక చేస్తోంది. అలానే హర్ష్ రోషన్ చేసిన హీరో పాత్రను నిర్మాత కతిరేసన్ కొడుకు హరి చేస్తున్నాడు. పోక్సో యాక్ట్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ కోర్ట్ డ్రామాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సోమవారం జరిగిన సినిమా పూజా కార్యక్రమాలకు హీరో విశాల్, దర్శకుడు వెట్రిమారన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మరి తెలుగు సినిమా స్థాయి విజయాన్ని తమిళ రీమేక్ 'రంజన్' అందుకుంటుందో లేదో చూడాలి.