ఎన్డీఏ-టీవీకే పొత్తు.. త్రిష చేతిలో నిర్ణయం
ABN , Publish Date - Mar 18 , 2026 | 06:34 AM
తమిళనాడులో ఎన్డీఏ-టీవీకే (TVK) పొత్తు సినీనటి త్రిష (Trisha Krishnan) చేతుల్లో ఉందని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో ఎన్డీఏ-టీవీకే (TVK) పొత్తు సినీనటి త్రిష (Trisha Krishnan) చేతుల్లో ఉందని రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో పాలక డీఎంకేదే పైచేయి అని, విపక్ష ఎన్డీఏపై 5% ఓట్ల ఆధిక్యంతో ఉందని.. ప్రముఖ సినీ నటుడు విజయ్ (thalapathy vijay) స్థాపించిన టీవీకే పార్టీకి 12% ఓట్లు రావచ్చని పలు సర్వేలు అంచనా వేసిన నేపథ్యంలో ఎన్ డీఏ నేతలు ఆప్రమత్తమయ్యారు. ఎలాగైనా విజయన్ తమ వైపు తిప్పుకొనేందుకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కరూర్ తొక్కిసలాట ఘటన వ్యవహారం విజయను ఇప్పటికీ వెంటాడుతోంది. సీబీఐ విచారణతో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆయన 'జననాయగన్' సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్సు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనకు సన్నిహితురాలిగా భావిస్తున్న త్రిష గత వారం ముంబైలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తో భేటీ అయినట్లు తెలిసింది.
ఆ తర్వాత ఈ నెల 15న సీబీఐ విచారణకు హాజరైన విజయ్.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా బయటకు వచ్చినట్లు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేగాక సెన్సార్ బోర్డు సైతం విజయ్ సినిమాను పునఃపరిశీలించేందుకు తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. త్రిష కృషి వల్లనే ఇది సాధ్యమైందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు.. అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కుమారుడు మిధున్ కూడా పలుమార్లు త్రిషతో సమావేశమైనట్లు తెలిసింది.