నాడు త్రిషపై అసభ్య కామెంట్స్.. నేడు విజయ్ పార్టీలో చేరిన నటుడు మన్సూర్ అలీఖాన్
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:02 PM
ప్రముఖ దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్, నటుడు మన్సూర్ అలీఖాన్ , మాజీ మంత్రి గోమతి టీవీకేలో చేరారు.
ప్రముఖ దర్శకుడు ఆర్వీ ఉదయకుమార్ (RV Udhayakumar), నటుడు మన్సూర్ అలీఖాన్ (Mansoor Ali Khan), మాజీ మంత్రి గోమతి పలువురు నేతలు శనివారం టీవీకే (TVK Party) లో చేరారు. పనయూరులోని టీవీకే ప్రధాన కార్యా లయం వద్ద శనివారం ఉదయం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, మంత్రి ఆదవ్ అర్జున (Aadav Arjuna) సమక్షంలో ఈ ముగ్గురూ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వీరికి అక్కడి నేతలు టీవీకే కండువాలు వేసి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరే కాకుండా వివిధ పార్టీల కార్యకర్తలు, నేతలంతా ఒకే సమయంలో రావటంతో పనయూరు పార్టీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
సుమారు 2500 మంది పార్టీ సభ్యత్వాన్ని స్వీకరిం చేందుకు రావటంతో వారిని అదుపు చేయటం టీవీకే నేతలకు తలకు మించిన భారంగా మారింది. ఒకేసారి అందరూ రావడంతో, వారందరినీ టీవీకే నేతలు కట్టుదిట్టం చేసి గేటు తెరిచి వరుసగా కార్యాలయం లోపలకు పంపారు. ఇలా వచ్చిన వారిపై బుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జునా కలిసి పార్టీ కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు. సుమారు గంటకు పైగా ఈ కార్యక్రమం కొనసాగింది.
ఈ సందర్భంగా మంత్రి ఆదవ్ అర్జున మాట్లాడుతూ.. అన్నాడీఎంకేలో సీనియర్ నేతలను గౌరవించక పోవడం వల్లే ఆ పార్టీ ప్రజాభిమానాన్ని కోల్పోతోందన్నారు. అన్నాడీఎంకేకు ఐదు దశాబ్దాల పాటు సేవలందించిన సెంగోట్టయ్యన్ను, నన్ను పార్టీ నుంచి బహిష్కరించి ఆ పార్టీ ఘోర తప్పిదానికి పాల్పడిందన్నారు. పదవుల ఆశ చూపి ఎవరినీ పార్టీలో చేర్చుకోవడం లేదని, ప్రజాభిమానం ఉన్న టీవీకేలో చేరితే తమ భవిష్యత్తు బాగుంటుందనే భావంతోనే ఇతర పార్టీలకు చెందిన వారంతా తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ బద్ధ శత్రువుల్లా వ్యవహరించిన డీఎంకే, అన్నాడీఎంకే ఏకమయ్యాయని, అది నచ్చకే రెండు పార్టీల నాయకులంతా టీవీకేలో చేరేందుకు వస్తున్నారని చెప్పారు. మన్నూర్ అలీఖాన్ మాట్లాడుతూ ఇక రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రి విజయ్ మాత్రమేనని, అన్ని వేళాలా ఆయనకు అండగా ఉండటమే తన లక్ష్యమన్నారు.
ఇదిలాఉంటే.. అసెంబ్లీ ఎన్నికల ముందు విజయ్ (Thalapathy Vijay), త్రిష (Trisha) కలిసి నటించిన లియో సినిమా అనంతరం మన్సూర్ అలీఖాన్ త్రిష విషయంలో చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. చాలా సినిమాల్లో అనేక మంది హీరోయిన్స్తో మానభంగం సన్నివేశాలు చేశాను.. కానీ త్రిషతో మాత్రం అలాంటి సన్నివేశాలు ఇప్పటివరకు చేయలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అయి దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. కోర్టు కేసుల వరకు వెళ్లడం కోర్టు శిక్ష వేయడం వంటివి కూడా జరిగిపోయాయి.
కట్ చేస్తే రెండు నెలల క్రితం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా త్రిష అభిమానించే విజయ్ టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో మరో ప్రాంతీయ పార్టీ నుంచి మన్సూర్ అలీఖాన్ సైతం పోటీ చేసి ఓడిపోయాడు. అయితే రెండు నెలల తిరక్కుండానే ఇప్పుడు మన్సూర్ సడన్గా టీవీకే పార్టీలో చేరి ఇక తమిళ నాడు రాష్ట్రానికి విజయ్ మాత్రమే పర్మినెంట్ ముఖ్యమంత్రి అంటూ మాట్లాడి మరోసారి వార్తల్లోకెక్కాడు. దీంతో ఇప్పుడు తమిళనాట ఈ విషయం గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటుండగా త్రిష ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.