ప్రధాని మోదీ చేతిని ముద్దాడిన భరణి!
ABN , Publish Date - May 11 , 2026 | 02:06 PM
భారత ప్రధాని నరేంద్ర మోదీని తనికెళ్ళ భరణి బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. రాముడు, కృష్ణుడు, ఆదిశంకరుడు, వివేకానందుడి అంశ మోదీ అని భరణీ అభివర్ణించారు.
ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి (Thanikella Bharani) కి భారత ప్రధాని మోదీ (Modi) అంటే అపరిమితమైన అభిమానం. ఆయన నేతృత్వంలో భారతదేశం అభివృద్ధిపథంలో పురోగమిస్తుందని తనికెళ్ళ భరణి గట్టిగా నమ్మారు. అందుకే ఆయన ఏ వేదిక మీద ఉన్నా... అవకాశం ఉంటే మోదీ గురించి నాలుగు మంచి మాటలు చెప్పి, ఆయనకు బాసటగా ప్రజలు నిలవాలని కోరుతుండేవారు. ఎన్నికల్లో మోదీకి విజయాన్ని అందించాలని, ఆయనకు దేశం పట్ల ఎంతో చిత్తశుద్ధి ఉందని అంటూ ఉండేవారు. అలాంటి భరణి తొలిసారి నరేంద్రమోదీని ఆదివారం రాత్రి బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. ఈ సందర్భంగా తన మదిలో మెదిలిన భావాలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆదివారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు బహిరంగ సభలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన మోదీ రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో ఆయనను భరణి కలిశారు.
ఈ సందర్భాన్ని భరణి ఇలా ఉదహరించారు. 'నేను రాముణ్ణి చూడలేదు, కృష్ణుణ్ణి చూడలేదు, ఆదిశంకరుల్ని చూడలేదు, వివేకానందుణ్ణి చూడలేదు. అంటే చూడలేము కూడా. కానీ వాళ్లందరి అంశలతో ఉన్న మోడీ గారిని చూశాను, ముట్టుకున్నాను, చేతిని ముద్దెట్టుకున్నాను. నా జన్మ ధన్యం' అని పేర్కొంటూ మోదీకి కరచాలనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. దాంతో బీజేపీ అభిమానులు, భరణీ అభిమానులు ఆయన్ని అభినందనలతో ముంచెత్తడం మొదలు పెట్టారు.