టీవీ వీక్షకులకు షాక్.. ఇక ప్రకటనలకు నో లిమిట్స్
ABN , Publish Date - Aug 17 , 2026 | 06:53 PM
టీవీల్లో ప్రకటనలపై ఉన్న పరిమితులను ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకొంది.
టీవీ ఛానెళ్ల (TV Channels) లో ప్రసారమయ్యే ప్రకటనలకు (TV Ads) సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు గంట వ్యవధిలో గరిష్ఠంగా 12 నిమిషాలు మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలన్న నిబంధన ఉండగా.. తాజాగా ఈ పరిమితిని తొలగించింది. ఆగస్టు 15న కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
టీవీ ఛానెళ్ల మధ్య న్యాయమైన పోటీ ఉండేలా చూడటంతో పాటు మారుతున్న మీడియా పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. పే చానెళ్లు, ఫ్రీ టు ఎయిర్ చానెళ్లు.. రెండూ ప్రకటనల ఆదాయంపై ఆధారపడుతున్నాయని పేర్కొంది. ప్రస్తుతం టీవీ ఛానెళ్ల మధ్య పోటీతో పాటు డిజిటల్ మీడియా నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో టీవీ ఛానెళ్లకు సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రకటనల ప్రసారంపై ఉన్న పరిమితులను తొలగించినట్టు సమాచార, ప్రసార శాఖ వెల్లడించింది.
ఈ నిర్ణయం అమలులోకి రావడానికి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్-1994లో సవరణలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన సవరణలను గెజిట్లో ప్రచురించిన తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. అయితే ఇకపై యాడ్స్ ప్రసారంపై ఉన్న 12 నిమిషాల పరిమితి తొలగిపోవడంతో ఇకపై టీవీ ఛానెళ్లలో ప్రకటనల సమయం పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రేక్షకులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది రానున్న రోజుల్లో చూడాలి.