సీబీఎఫ్సీ నుంచి ప్రసారభారతికి ప్రసూన్ జోషి... మరి ఇక్కడెవరు!?
ABN , Publish Date - May 05 , 2026 | 01:41 PM
సీబీఎఫ్సీ ఛైర్మన్ ప్రసూన్ జోషీని ప్రసార భారతి చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దాంతో సీబీఎఫ్సీ ఛైర్మన్ గా ఎవరిని నియమిస్తారనే విషయంలో చర్చ జరుగుతోంది.
ప్రముఖ కవి, సినీ గీత రచయిత, మోటివేటర్ ప్రసూన్ జోషి (Prasoon Joshi) ని కేంద్ర ప్రభుత్వం ప్రసారభారతి ఛైర్మన్గా ఇటీవల నియమించింది. 'తారే జమీన్ పర్, చిట్టగాంగ్' చిత్రాలలో పాటలు రాసినందుకు గానూ రెండుసార్లు ప్రసూన్ జోషి ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డులు అందుకున్నారు. అలానే మూడు సార్లు బెస్ట్ రిలిక్ రైటర్గా ఫిల్మ్ ఫేర్ అవార్డులు పొందారు. భారతీయ కళలు, సాహిత్యంలో ప్రవేశం ఉండటమే కాకుండా ప్రసూన్ జోషికి ప్రకటనల రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. అలానే మోటివేట్ స్పీకర్ గానూ జాతీయ స్థాయిలో మంచి పేరు సంపదించుకున్నారు. అందుకే ఆయనను పుష్కర కాలం క్రితమే భారత ప్రభుత్వం పద్మశ్రీ (Padmasri) పురస్కారంతో సత్కరించింది. 2017లో ప్రసూన్ జోషిని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సి CBFC) ఛైర్మన్గా నియమించింది. అయితే ఈ యేడాది మే 2న ఆయన్ని ప్రసార భారతి ఛైర్మన్ చేశారు. నిజానికి మూడు నెలలుగా ప్రసార భారతి చైర్మన్ పోస్ట్ ఖాళీగా ఉంది. అంతకు ముందు అక్కడ ఉన్న నవనీత్ కుమార్ సెహగల్ డిసెంబర్లో రాజీనామా చేశారు. ఇప్పుడా పోస్ట్ను జోషితో భర్తీ చేశారు.
సీబీఎఫ్సీలో సుదీర్ఘకాలం ఛైర్మన్గా సేవలు అందించిన ప్రసూన్ జోషీ స్థానంలో ఎవరిని ఛైర్మన్గా నిర్మిస్తారనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే... ప్రసూన్ జోషీ సీబీఎఫ్సీని గాడిలోకి తీసుకొచ్చినా... గత కొంతకాలంగా మరీ ముఖ్యంగా సీబీఎఫ్సీ సీఇవోగా రాజేంద్ర సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రీజనల్ సెన్సార్ అధికారులపై రకరకాలుగా ఒత్తిడి పెరిగిందని అంటున్నారు. సినిమాల పేర్లను మార్చడం, కంటెంట్ విషయంలో కఠినంగా వ్యవహరించడం, ప్రాంతీయ స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నా కేంద్ర స్థాయిలో వాటిపై తిరిగి విశ్లేషణ చేయడం వంటి కారణాలతో సినిమాల సెన్సార్ ఆలస్యమౌతోందని, అర్థంలేని విధంగా సెంట్రల్ సెన్సార్ బోర్డ్ వ్యవహరిస్తోందని ఆరోపణలు వచ్చాయి.
సినిమాలలో మితిమీరిన హింసను పట్టించుకోని సెన్సార్ బృందం చిన్న చిన్న విషయాలకు సైతం అభ్యంతరం వ్యక్తం చేసి ఇబ్బంది పెడుతోందని అంటున్నారు. ఇటీవల చాలా చిత్రాల సెన్సార్ ఆలస్యమైందని, విజయ్ 'జన నాయగన్' దానికి పరాకాష్ఠ అని చెబుతున్నారు. అయితే ప్రసూన్ జోషీ పనితనానికి మాత్రం కేంద్ర సమాచార ప్రసార శాఖ ఫిదా అయిపోయింది. సీబీఎఫ్సీని సమర్థవంతమైన సంస్థగా ప్రసూన్ జోషీ మార్చారంటూ కితాబిస్తోంది. అయితే ఇప్పుడు ఈయన్ని సీబీఎఫ్సీ నుంచి తప్పించి, ప్రసార భారతి ఛైర్మన్ చేయడంతో ఈ కీలక పదవిలో ఎవరిని కూర్చోపెడతారనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.