Malayalam: రోడ్డు ప్రమాదం.. మలయాళ నటుడు సంతోష్ నాయర్ మృతి
ABN , Publish Date - May 05 , 2026 | 04:19 PM
ప్రముఖ మలయాళ నటుడు సంతోష్ నాయర్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన నటించిన చివరి చిత్రం 'మోహినీయట్టం' ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమౌతోంది.
ప్రముఖ మలయాళ నటుడు సంతోష్ నాయర్ (65) (Santhosh Nair) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు ఆయన భార్య శుభశ్రీతో కలిసి కారులో వెళుతుండగా, అది అదుపు తప్పి పార్సిల్ లారీని ఢీ కొట్టింది. వెంటనే ఆయన్ని స్థానికులు హాస్పిటల్కు తీసుకెళ్ళారు. అయితే చికిత్స జరుగుతుండగా గుండెపోటు రావడంతో సంతోష్ నాయర్ తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. ఆయన భార్య శుభశ్రీ కూడా గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సైతం గాయపడినట్టు తెలుస్తోంది. పథనందిట్ట జిల్లాలోని ఎనతు దగ్గర ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
1982లో నటుడిగా సంతోష్ నాయర్ కెరీర్ ప్రారంభించారు. దాదాపు 100కు పైగా సినిమాలలో ఆయన హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. సంతోష్ నాయర్ నటించిన చివరి చిత్రం 'మోహినీయట్టం' ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమౌతోంది. సంతోష్ నాయర్ మృతి పట్ల మలయాళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నటుడు రహమాన్, సూరజ్ వెంజరమూడు తదితరులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.