Tollywood: చంద్రబాబు ఆవిష్కరించిన ‘మీర్జాపురం రాణి - కృష్ణవేణి’ పుస్తకం
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:28 PM
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రాసిన 'మీర్జాపురం రాణి - కృష్ణవేణి' పుస్తకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి కుమార్తె ఎన్.ఆర్. అనురాధాదేవి కూడా పాల్గొన్నారు.
అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి (Krishnaveni) జీవిత చరిత్రను సీనియర్ జర్నలిస్ట్ భగీరథ ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) బుధవారం సచివాలయంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 'ఆ తరం నటీమణి, గాయని, స్టూడియో అధినేత కృష్ణవేణి జీవితం ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుందని, అందుకే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉంద'ని చంద్రబాబు చెప్పారు. 'మహానటుడు ఎన్. టి. రామారావు గారిని 'మనదేశం' (Manadesam) సినిమా ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణి గారంటే తనకు ఎంతో గౌరవమ'ని చంద్రబాబు తెలిపారు. తన పుస్తకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించడం మర్చిపోలేని అనుభవమని రచయిత భగీరథ అన్నారు.

ఈ పుస్తకావిష్కరణలో కృష్ణవేణి కుమార్తె, ప్రముఖ నిర్మాత ఎన్.ఆర్. అనురాధా దేవి, నిర్మాత నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్ నేత టీడీ జనార్థన్, నిర్మాతలు డీవీకే రాజు, ఉమామహేశ్వరరావు, పర్వతనేని రాంబాబు, కాకాని బ్రహ్మం, క్రొత్తపల్లి శ్రీధర్ ప్రసాద్, ఝాన్సీ రాణి, నటుడు అభిరామ్, గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.