‘యమహా మ్యూజిక్’ ప్రచారకర్తగా ఏ.ఆర్. రెహ్మాన్
ABN , Publish Date - Mar 24 , 2026 | 09:31 AM
ప్రముఖ సంగీత దర్శకుడు, అకాడెమీ అవార్డు గ్రహీత ఏ.ఆర్. రెహ్మాన్ (A R Rahman) ప్రముఖ సంస్థకు ప్రచారకర్తగా నియమితులయ్యారు.
యమహా మ్యూజిక్ ఇండియాకు (Yamaha Music India) బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ సంగీత దర్శకుడు, అకాడెమీ అవార్డు గ్రహీత ఏ. ఆర్. రెహ్మాన్ (A R Rahman) నియమితులయ్యారు. భారతీయ సంగీత ప్రపంచాన్ని మరింత బలోపేతం చేయాలన్న ముఖ్యోద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు యమహా మ్యూజిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యమమోటో టకేతోషి వెల్లడించారు.

ఆయన మాట్లాడుతూ, 'యమహా తత్వానికి సంగీతమే మూలస్తంభం. భారతదేశపు గొప్ప సంగీత వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించాలన్నదే మా ఆకాంక్ష. మేం ప్రారంభించిన ‘మేడ్ ఇన్ ఇండియా’ చొరవ, ఏ.ఆర్.రెహ్మాన్ సహకారంతో రాబోయే తరాల సంగీతకళాకారులకు స్ఫూర్తినివ్వాలని, దేశ వ్యాప్తంగా క్రమబద్ధమైన సంగీత విద్యనందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని అన్నారు. ఏ. ఆర్. రెహ్మాన్ మాట్లాడుతూ, ‘యమహా ఎల్లవేళలా ఖచ్చితత్వానికి, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచింది. సంగీత నైపుణ్యంతో పాతుకుపోయిన వారసత్వం కలిగిన, నాణ్యమైన వాయిద్య పరికరాలను సంగీత కళాకారులకు అందుబాటులోకి తీసుకుని రావడమే ‘మేడ్ ఇన్ ఇండియా’ లక్ష్యం' అని వివరించారు.