ముంబైలో దూసుకెళ్తున్న సౌత్ హీరోయిన్లు.. నయనతార, రష్మిక, సాయిపల్లవి, శ్రీలీలపై బాలీవుడ్ ఫోకస్
ABN , Publish Date - Aug 03 , 2026 | 09:37 AM
సౌత్లో స్టార్డమ్ సాధించిన నయనతార, రష్మిక మందన్న, సాయిపల్లవి, శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్లోనూ తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు.
నిన్న మొన్నటిదాకా మన దగ్గర బిజీ బిజీగా కనిపించిన నాయికలు ఇప్పుడు ముంబై వీధుల్లోనూ అంతే ఇష్టంగా సందడి చేస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించాలని కొందరు పరుగులు తీస్తుంటే, ఇప్పటికే వచ్చిన గెలుపును కొనసాగించాలనే ప్రయత్నం మరికొందరిది. ఈ రేసులో ఎంతో మంది ఉన్నప్పటికీ, నలుగురు భామల మీద మాత్రం ఫోకస్ ఎక్కువగా ఉంది.
చేతిలో అర డజనుకు పైగా సినిమాలతో బిజీ బిజీగా కనిపిస్తున్నారు నయనతార (Nayanthara). ఎన్ని సినిమాలు చేసినా ‘టాక్సిక్’ మాత్రం చాలా స్పెషల్ అంటున్నారు. ఉత్తరాదిన ఈ లేడీ సూపర్స్టార్ నటించిన ‘జవాన్’ వెయ్యికోట్ల క్లబ్లో చేరింది. ఇప్పుడు ఆ సక్సెస్ని ‘టాక్సిక్’తో కొనసాగాలన్నది నయన్ కోరిక. ఆమెకన్నా ముందే పలు చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించారు రష్మిక మందన్న (Rashmika Mandanna). ఆమె నటించిన ‘కాక్టైల్2’ ఇటీవల విడుదలైంది. ప్రస్తుతం ‘మైసా’, ‘రణబాలి’లో నటిస్తున్నారు. తదుపరి ఈ లేడీ నార్త్లో ఏ స్క్రిప్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనే ఆసక్తి కూడా జనాల్లో మెండుగానే ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో..
సౌత్లో డ్యాన్సింగ్ క్వీన్స్గా పేరుంది సాయిపల్లవి ( Sai Pallavi)కి.ఇలీవల ఈ హైబ్రీడ్ పిల్ల జునైద్తో నటించిన ‘ఏక్ దిన్’ సినిమా పల్లవికి అనుకున్నంత విజయాన్ని తెచ్చిపెట్టలేదు. దాంతో ఇప్పుడు ఈ భామ ఆశలన్నీ‘రామాయణ’ మీదే ఉన్నాయి. రణ్బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘రామాయణ’లో సీత పాత్రలో నటిస్తున్నారు సాయిపల్లవి. అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించాలనే సంకల్పంతో ఉన్నారు ఈ తమిళ పొన్ను.
తొలి ప్రయత్నంతోనే..!
తెలుగులో కెరీర్ జోరుమీదున్న సమయంలో కాస్త గ్యాప్ తీసుకున్నారు శ్రీలీల (Sreeleela). అప్పటి నుంచి సరైన హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా టాప్ హీరోయిన్గా సౌత్లో కంటిన్యూ అవుతున్నారు మిస్ లీల. అదే జోరును ఉత్తరాదిన కూడా చూపించాలని భావిస్తున్నారు. అనురాగ్ బసు చిత్రంతో ఉత్తరాదికి పరిచయం కానున్నారు శ్రీలీల.