ది కేరళ స్టోరీ 2: మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసేలా ఉండడంతో..

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:44 PM

‘ది కేరళ స్టోరీ 2’ సినిమా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే!


‘ది కేరళ స్టోరీ 2’ సినిమా తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా విడుదలకు ముందు కోర్టులో ప్రదర్శించాలని కేరళ హైకోర్టు పేర్కొంది. మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీసే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని కేరళ వాసులు చేస్తున్న ఆందోళనలను కొట్టిపారేయలేమని కోర్టు పేర్కొంది. సెన్సార్‌బోర్డ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. కోర్టులు సాధారణంగా సినిమాలకు సంబంధించి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో అంతగా కల్పించుకోదు. కానీ ఈ సినిమా టైటిల్‌లో రాష్ట్రం పేరు ఉపయోగించారని, అందుకే ఈ కేసును విచారణకు అంగీకరించినట్లు తెలిపింది. ఈ నెల 25న ‘ది కేరళ స్టోరీ 2’ను కోర్టులో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి సెన్సార్‌ విషయంలో నిర్ణయం తీసుకోగలమని తెలిపింది. 2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. అయితే ఆ చిత్రానికి సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించగా  ‘ది కేరళ స్టోరి-2’ చిత్రానికి కామాఖ్య నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల సెన్సార్‌ బోర్డ్‌ యు/ఎ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఫిబ్రవరి 27న ఈ చిత్రం విడుదల కానుంది.  

Updated Date - Feb 24 , 2026 | 04:49 PM