సీనియర్ నటి.. ఆశా సింగ్ జైస్వాల్ కన్నుమూత
ABN , Publish Date - Aug 23 , 2026 | 09:54 PM
బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి,భారతదేశపు తొలి మిమిక్రీ ఆర్టిస్ట్ ఆశా సింగ్ జైస్వాల్ కన్నుమూశారు.
బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి,భారతదేశపు తొలి మిమిక్రీ ఆర్టిస్ట్ ఆశా సింగ్ జైస్వాల్ (Asha Singh Jaiswal) కన్నుమూశారు. గడిచిన మూడు నెలలుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆశా సింగ్ జైస్వాల్ మరణ విషయాన్ని ఆమె కుమారుడు ఆకాశ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తల్లి ఇక లేరనే వార్తను పంచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు, సహచర కళాకారులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
ఆశా సింగ్ జైస్వాల్ తన నటనా ప్రస్థానంలో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ‘బాజీగర్’, ‘తేరీ తలాష్ మే’, ‘పెచైన్’ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఆమె తనదైన ముద్ర వేశారు. ప్రత్యేకంగా భారతీయ టెలివిజన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ‘మహాభారత’ సీరియల్లో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. పలు టీవీ సీరియల్స్లో నటిస్తూ విభిన్న పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. దశాబ్దాల పాటు సినీ, టెలివిజన్ రంగాల్లో సేవలందించిన ఆశా సింగ్ జైస్వాల్ మరణం కళా రంగానికి తీరని లోటని పేర్కొంటూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు సోషల్ మీడియాలో సంతాప సందేశాలు పోస్టు చేస్తున్నారు.