Akshay Kumar: చందు మొండేటి మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:49 PM
ప్రముఖ దర్శకుడు చందు మొండేటి మరో పాన్ ఇండియా సినిమాకు శ్రీకారం చుట్టాడు. అక్షయ్ కుమార్, రానా హీరోలుగా ఉజ్జయిని నేపథ్యంలో చందు మొండేటి ఓ సినిమా తీయబోతున్నాడు.
'కార్తికేయ, ప్రేమమ్, కార్తికేయ 2, తండేల్' వంటి సూపర్ హిట్ చిత్రాలను రూపొందించాడు దర్శకుడు చందు మొండేటి. 2014లో 'కార్తికేయ' సినిమాతో మెగాఫోన్ పట్టిన చందు మొండేటి గడిచిన పుష్కరకాలంలో తెరకెక్కించింది కేవలం ఆరు సినిమాలు మాత్రమే. అందులో ఐదు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కాగా... 'బ్లడీ మేరీ' ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక అతని తాజా చిత్రం 'తండేల్' వంద కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమా, దీనికి ముందు చందు మొండేటి తెరకెక్కించిన 'కార్తికేయ 2' చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాల సక్సెస్ స్ఫూర్తితో చందు మొండేటి మరో పాన్ ఇండియా మూవీకి శ్రీకారం చుట్టబోతున్నాడు.
రానా దగ్గుబాటి (Rana Daggubati), అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోలుగా ఓ హిస్టారికల్ థ్రిల్లర్ను చందు మొండేటి (Chandu Mondedi) తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఉజ్జయిని నేపథ్యంలో రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో మరో టాప్ హీరో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడని అంటున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ భారీ స్థాయిలో నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.