నటి అనన్య రాజ్ కన్నుమూత... ఆలస్యంగా వెలుగులోకి!
ABN , Publish Date - Aug 17 , 2026 | 04:22 PM
నటి అనన్య రాజ్ అనారోగ్యంతో కన్నుమూసింది. నవీన్ చంద్ర సరసన 'తగ్గేదే లే'మూవీలో నటించిన ఆమె త్రిభాషా చిత్రం 'మద్రాసీ గ్యాంగ్'లో చివరగా నటించింది.
హిందీ చిత్రాలతో పాటు తెలుగులో 'తగ్గేదే లే' చిత్రంలో నవీన్ చంద్ర సరసన నటించిన అనన్య రాజ్ అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె వయసు 35 సంవత్సరాలు. 1991లో గోరఖ్ పూర్ లో జన్మించిన అనన్య రాజ్, తొలుత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి వచ్చింది. హిందీలో 2016లో 'సెవన్ అవర్స్ టు గో' చిత్రంతో అరంగేట్రమ్ చేసింది. ఆ తర్వాత సంవత్సరం 'ద ఫైనల్ ఎగ్జిట్'లోనూ, 2019లో 'ఘోస్ట్' చిత్రంలోనూ అనన్య రాజ్ నటించింది. కొన్ని మ్యూజిక్ వీడియోస్లోనూ అనన్య రాజ్ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో 2022లో వచ్చిన నవీన్ చంద్ర 'తగ్గేదే లే' చిత్రంలో ఆమె నటించింది. ఆ సినిమా అదే యేడాది నవంబర్ 4న విడుదలైంది. అయితే సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో అనన్య రాజ్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. 'తన తల్లికి నటి కావాలనే కోరిక ఉండేదని, కానీ వివాహం కారణంగా ఆమె ఆ కోరికను నెరవేర్చుకోలేకపోయిందని, అందుకే తనను నటిని చేయాలని ఆమె కోరుకుంద'ని అనన్య రాజ్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. తల్లి కోరిక మేరకు చిత్రసీమలోకి అడుగు పెట్టి నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అనన్య రాజ్ ఊహించని విధంగా ఈ లోకం నుంచి నిష్క్రమించింది.

సంవత్సరకాలంగా మానసికంగా, శారీరకంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని, ఓ యోధురాలి తరహాలో పోరాటం చేసిందని ఆమె కుటుంబ సభ్యులు ఇన్ స్టాగ్రామ్ లో ఓ మెసేజ్ ను పోస్ట్ చేశారు. అనారోగ్యంతో అనన్య రాజ్ జూలై 15వ తేదీ నిద్రలోనే కన్నుమూసిందని ఆ ప్రకటనలో తెలిపారు. ఆమె మరణానికి కారణమైన అనారోగ్యం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అలానే గత నెల 15న ఆమె చనిపోతే ఇప్పటి వరకూ ఎందుకు ఆ విషయాన్ని తెలియచేయలేదనే సందేహాన్ని నెటిజన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నటిగా గుర్తింపు పొందాలని హిందీతో పాటు దక్షిణాది రాష్ట్రాలలోనూ తన వంతు కృషి చేసిన అనన్య రాజ్ అకాల మరణం చాలామందిని బాధకు గురిచేసింది. చివరగా ఆమె త్రిభాషా చిత్రం 'మద్రాసీ గ్యాంగ్'లో నటించింది.
ఇవి కూడా చదవండి:
రైలులో హీరోయిన్ హల్చల్.. బట్టలు విప్పేసి బ్లేడుతో దాడి
బండ్ల గణేష్ కూతురు పెళ్లి.. అక్కినేని కోడలే హైలైట్
రష్మిక షో ఆఫ్ కామెంట్స్పై యశ్ రియాక్షన్.. అసలు నిజం ఇదిగో