Gaddar Awards : రేవంత్ పై కాట్రగడ్డ ప్రసాద్ ప్రశంసల జల్లు
ABN , Publish Date - Jun 16 , 2025 | 03:42 PM
సీనియర్ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినీ ప్రముఖులను సత్కరించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
సీనియర్ నిర్మాత, సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ (Katragadda Prasad) తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Telangana Gaddar Film Awards) ప్రదానోత్సవం జరిగిన తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రామాన్ని దిగ్విజయం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యంగా ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆరు నెలల పాటు కష్టపడి ఘనంగా వారు ఈ కార్యక్రమాన్ని జరపడం సినిమా రంగంతో 54 సంవత్సరాల అనుబంధం ఉన్న వ్యక్తిగా తనకు సంతోషాన్ని కలిగించిందని అన్నారు.
1964 నుండి నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని, 2013 వరకూ వాటిని ఇచ్చారని కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారని, అప్పుడు కూడా మూడేళ్ళకు నంది అవార్డులను ప్రకటించారని, 2014, 15, 16తో పాటు మరో రెండేళ్ళ అవార్డులను ప్రకటించి ఐదేళ్ళకు అవార్డుల ప్రదానోత్సవం జరపాలని చంద్రబాబు భావించినా, ఇంతలో ఎన్నికలు రావడం ఆ తర్వాత వేరే పార్టీ అధికారంలోకి రావడంతో వాటి ప్రదానం జరగలేదని కాట్రగడ్డ ప్రసాద్ తెలిపారు.
గడిచిన పదేళ్ళుగా తెలంగాణలో ఉన్న ప్రభుత్వం చిత్రసీమను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని వాపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వడం అభినందించాల్సిన విషయమని అన్నారు. అంతే కాకుండా తెలుగు సినిమా అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తానని మాట ఇచ్చారని, ప్రభుత్వ పరంగా కొన్ని సందర్భాలలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చినా సినిమా వారంటే ఆయనకు అభిమానమేనని కాట్రగడ్డ ప్రసాద్ చెప్పారు. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలకూ హైదరాబాద్ నెలవు కావాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని, ఆయన చెప్పింది చేస్తారని నమ్మకం తనకుందని అన్నారు.
Also Read: Director Maruthi: డార్లింగ్.. ఇద్దరు హీరోయిన్లను పెట్టవా అని అడిగాడు
Also Read: The Rajasaab: రాజా సాబ్.. మారుతి మొత్తం చెప్పేశాడు...