Tollywood: తెలుగు నిర్మాతలకు పరభాషల్లో చేదు అనుభవం

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:28 PM

గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగు సినిమా వెలుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు నిర్మాతలు పరభాషల్లోనూ చిత్రాలను నిర్మిస్తున్నారు. అయితే మనవాళ్ళు గత వైభవం చూడటం లేదని టాక్. ఆ ముచ్చటేంటో తెలుసుకుందాం.

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్స్ తో సినిమాలు తీసే నిర్మాతలు, దర్శకులు పాన్ ఇండియా (Pan India) మూవీస్ నే ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్ (Prabhas) 'సలార్, కల్కి 2898' చిత్రాలు, అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' సిరీస్ పాన్ ఇండియా మూవీస్ గా సత్తా చాటాయి. ఇక డైరెక్టర్స్ లో రాజమౌళి (Rajamouli) చేసిన మ్యాజిక్ తో 'బాహుబలి' సిరీస్, 'ట్రిపుల్ ఆర్' మూవీ కూడా ఆల్ ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లోనూ అలరించాయి. ఈ నేపథ్యంలోనే మన తెలుగు సినిమా నిర్మాతలు కొందరు పరభాషల్లోనూ సినిమాలు తీసి అలరించే ప్రయత్నం చేస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, పీపుల్స్ మీడియా, గీతా ఆర్ట్స్, సితారా ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు ఆ దిశగా అడుగులు వేశాయి. అయితే ఈ సంస్థలు నిర్మించిన చిత్రాలు మన వారి పాన్ ఇండియా మూవీస్ స్థాయిలో అలరించలేదన్నది వాస్తవం.


తెలుగు సినిమా వెలగడం అనేది ఇప్పుడే కాదు ఇండియన్ సినిమా 'గోల్డెన్ ఎరా' చూసిన రోజుల్లోనే ఉంది. మన తెలుగు మూవీమేకర్స్ ఎల్.వి. ప్రసాద్, కె. యస్. ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, కె. ప్రత్యగాత్మ వంటివారు హిందీ, తమిళ భాషల్లోనూ విజయాలను సాధించారు.. తరువాతి రోజుల్లో కె. బాపయ్య, తాతినేని రామారావు, తాతినేని ప్రసాద్, కె. రాఘవేంద్రరావు, కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు, బాపు, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులతో తెలుగు నిర్మాణ సంస్థలు నిర్మించిన హిందీ చిత్రాలు సైతం విజయభేరీ మోగించాయి. ఇక నిర్మాణ సంస్థల్లో ప్రసాద్ ఫిలిమ్స్, సురేశ్ ప్రొడక్షన్స్, పద్మాలయా, జగపతి పిక్చర్స్, రోజా మూవీస్ కూడా హిందీలో చిత్రాలు నిర్మించి మంచి విజయాలు సాధించాయి. ఆ రోజుల్లో ఈ సంస్థల చిత్రాల ద్వారా పలువురు నాయికలు ఉత్తరాదిన జయకేతనం ఎగురవేశారు. ఇక అల్లు అరవింద్ హిందీలో నిర్మించిన 'గజిని'తోనే ఇండియన్ మూవీ తొలిసారి వంద కోట్ల క్లబ్ ను క్రియేట్ చేయడం మరచిపోలేని అంశం. ఇలా గతంలో పలు మైల్ స్టోన్స్ అనదగ్గ చిత్రాలను తెలుగు నిర్మాతలు ఉత్తరాదికీ అందించారు.


భవిష్యత్ లో ఛాన్స్ ఉందా!?

గత వైభవం స్ఫూర్తితోనే మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఎక్కువగా పరభాషల్లో చిత్రాలు నిర్మించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్యే మైత్రీ తో కలసి పీపుల్స్ మీడియా నిర్మించిన 'జాట్' సినిమా టాక్ బాగానే సంపాదించింది.. అయినా' మురిపించలేకపోయింది. మైత్రీ మూవీస్ తమిళంలో నిర్మించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కూడా ఆకట్టుకోలేక పోయింది. ఉత్తరాదివారితో కలసి గీతా ఆర్ట్స్, దిల్ రాజు, నాగవంశీ నిర్మించిన 'జెర్సీ' కూడా మెప్పించలేదు. తమిళ, కన్నడ భాషల్లోనూ మరికొందరు తెలుగు నిర్మాతలు చిత్రాలు నిర్మించి అలరించలేకపోయారు.. ఇలా మళ్ళీ తెలుగు నిర్మాతలు పరభాషల్లో చిత్రాలు నిర్మించి వెలిగిపోతున్నారే కానీ, మునుపటి సక్సెస్ రేట్ ను చవిచూడడం లేదు. ఈ నేపథ్యంలోనే షారుఖ్, సల్మాన్ వంటి హీరోలతో చిత్రాలు నిర్మించే దిశగా మైత్రీ మూవీ మేకర్స్ అడుగులు వేస్తోందని టాక్. మరి పాత రోజుల్లోలాగా ఈ నాటి టాలీవుడ్ ఫిలిమ్ హౌసెస్ పరభాషల్లో ఇక ముందైనా మెప్పిస్తాయేమో చూద్దాం.

Also Read: Lavanya Tripathi: పోస్ట్ ప్రొడక్షన్ లో సతీ లీలావతి...

Also Read: Love Marriage: పెళ్లి కోసం ఎన్ని కష్టాలో... 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 21 , 2025 | 01:28 PM