AS Ravi Kumar Chowdary: సినీ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రవి కుమార్ చౌదరి మృతి

ABN , Publish Date - Jun 11 , 2025 | 10:18 AM

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు ఏ ఎస్ రవి కుమార్ చౌదరి క‌న్నుముశారు.

as ravi

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ‌ ద‌ర్శ‌కుడు ఏ ఎస్ రవి కుమార్ చౌదరి (Director AS Ravi Kumar Chowdary) క‌న్నుముశారు. కొంత‌కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న గుండెపోటుతో మృతి చెందారు.

ఆకాశ్ హీరోగా, అర్జు గోవిత్రికర్ హీరోయిన్ గా నటించిన 'మనసుతో...' సినిమాతో ఎ.ఎస్. రవికుమార్ చౌదరి దర్శకుడిగా పరిచయం అయ్యారు. వి. ఆనంద ప్రసాద్ ఆ సినిమాను నిర్మించారు. గోపీచంద్ హీరోగా ఎ.ఎస్. రవి కుమార్ చౌదరి తెరకెక్కించిన యజ్ఞం సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాను ఈతరం ఫిలిమ్స్ పతాకంపై పోకూరి బాబూరావు నిర్మించారు. ఆ బ్యానర్ లోనే 'ఏం పిల్లా... ఏం పిల్లడో' సినిమానూ తనీష్ హీరోగా రవికుమార్ చౌదరి తెరకెక్కించారు. ఆయ‌న ఆపైన బాల‌కృష్ణతో 'వీర‌భ‌ద్ర‌', మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తో 'పిల్ల నువ్వు లేని జీవితం', గోపిచంద్‌తో రెండో సారి 'సౌఖ్యం', నితిన్‌తో 'ఆటాడిస్తా' వంటి సినిమాలను రూపొందించారు.


రవికుమార్ చౌదరికి భార్య, పిల్ల‌లు ఉండ‌గా గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. రవికుమార్ చౌదరి రీసెంట్‌గా రాజ్ తరుణ్ తో 'తిరగబడరా సామి' సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే నిన్న (మంగ‌ళ‌వారం) రాత్రి ఆయన క‌న్నుమూసిన‌ట్లుగా తెలిసింది. మరణంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గ‌త సంవ‌త్స‌రం రవి కుమార్ చౌదరి డైరెక్ట్ చేసిన 'తిర‌గ‌బ‌డ‌రా సామి' సినిమా ప్ర‌మోష‌న్‌లో ఓ హీరోయిన్‌కు ముద్దు పెట్ట‌డం బాగా చ‌ర్చనీయాంశం అయింది. అదేవిధంగా త‌రుచూ మ‌న‌కు ఏదో ఒక సోష‌ల్ మీడియాలో వినప‌డే, చూసే మీమ్‌ 'స‌రే స‌రేలే... ఎన్నోన్నో అనుకుంటాం... అన్నీ జరుగుతాయా ఏంటీ?' అనే ఫేమ‌స్ బాల‌కృష్ణ‌ డైలాగ్ ఈయ‌న‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన వీర‌భ‌ద్ర సినిమాలోదే కావ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Jun 11 , 2025 | 01:26 PM