టీఎఫ్సీసీ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా
ABN , Publish Date - Jun 09 , 2025 | 04:39 AM
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో పలు వివాదాలకూ, సంచలనాలకు కారణమైన సింగిల్ స్ర్కీన్ థియేటర్ల మూసివేత అంశం తాజాగా కొత్త మలుపు తీసుకుంది. తెలంగాణ ఫిల్మ్చాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్సీసీ) అధ్యక్ష పదవికి...
ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో పలు వివాదాలకూ, సంచలనాలకు కారణమైన సింగిల్ స్ర్కీన్ థియేటర్ల మూసివేత అంశం తాజాగా కొత్త మలుపు తీసుకుంది. తెలంగాణ ఫిల్మ్చాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్సీసీ) అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ ఆదివారం రాజీనామా చేశారు. శనివారం జరిగిన టీఎఫ్సీసీ ఎన్నికల్లో నారంగ్ అధ్యక్షుడిగా ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవికి ఎన్నికవడం ఇది మూడోసారి. అయితే అధ్యక్ష పదవి చేపట్టి 24 గంటలు కూడా గడవకముందే ఆయన రాజీనామా చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం కలిగించింది. ‘నాకు సంబంధం లేకుండా నా పేరుతో పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి ఏదైనా ప్రకటన ఇచ్చేముందు, ఇంటర్వ్యూ, ప్రెస్ మీట్ నిర్వహించే ముందు నాకు సమాచారం ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక టీఎఫ్సీసీ అధ్యక్షుడిగా కొనసాగలేను’ అని ఆయన టీఎఫ్సీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కానీ ఆయన రాజీనామా కోసం తెరవెనుక పెద్ద తతంగమే నడిచిందంటున్నాయి పరిశ్రమ వర్గాలు.
శ్రీధర్ విమర్శలపై ఇండస్ట్రీ ఆగ్రహం
కొత్త కార్యవర్గం ఏర్పాటైన సందర్భంగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీఎఫ్సీసీ సెక్రటరీ శ్రీధర్ టాలీవుడ్ అగ్రహీరోలను ఉద్దేశించి చేసిన పరుష వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని కొన్ని వర్గాలకు రుచించలేదని సమాచారం. ‘నీ ప్రోద్భలం లేకుండా నీ సమక్షంలోనే అతను అంత దురుసుగా ఎలా మాట్లాడతాడు, నువ్వు అక్కడే ఎందుకు ఖండించలేదు’ అంటూ ఇండస్ట్రీ శక్తులు కొన్ని నిప్పులు చెరగడంతో ఎటూ పాలు పోని పరిస్థితుల్లో సునీల్ రాజీనామా చేశారనే మాట వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని అడ్డుకునేందుకే థియేటర్ల మూసివేత అంశాన్ని తెరపైకి తెచ్చారని జరిగిన ప్రచారంలో ఆ నలుగురు( అల్లు అరవింద్, దిల్రాజు-శిరీ్ష, సురేశ్బాబు) లో సునీల్నారంగ్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. అయితే ‘అందులో నేను లేను, పవన్ కల్యాణ్ సినిమా అడ్డుకునే సాహసం ఎవరూ చేయలేరు’ అని శనివారం నిర్వహించిన ప్రెస్మీట్లో సునీల్ నారంగ్ వివరణ ఇచ్చారు. కానీ అదే ప్రెస్మీట్లో శ్రీధర్ ఇద్దరు దర్శకులు, ఇద్దరు హీరోలు చేసిన కుట్రలో భాగమే ఇదంతా అంటూ చేసిన వ్యాఖ్యలు సునీల్ నారంగ్ మెడకు చుట్టుకున్నాయి.
పవన్ సినిమా రాకుంటే మా పరిస్థితి ఏమిటి?
అసలు ఇంతకీ మీడియా సమావేశంలో శ్రీధర్ ఏమన్నారంటే ‘వరల్డ్వైడ్ రూ. 2 కోట్ల వసూళ్లు రాని హీరోకి రూ. 13 కోట్ల పారితోషికం ఇచ్చారు. ఒకప్పుడు రెండు మూడు సినిమాలు చేసేవాళ్లు హీరోలు. ఇవ్వాళ రెండేళ్లకో సినిమా తీస్తున్నారు. భారీగా పారితోషికం తీసుకోవడమే దానికి కారణం. పవన్ కల్యాణ్ సినిమా వస్తుందని మేం థియేటర్లు అన్నీ ఖాళీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నెల మొత్తం వృథాగా పోయినట్లే. హీరోలకు ఈ స్టార్డమ్ ఎక్కడ నుంచి వచ్చింది. ఒక హీరో ఏడాదికి రెండు సినిమాలైనా చేయకపోతే సింగిల్ స్ర్కీన్లు నడవవు. లేదంటే గోదాములు, సూపర్ మార్కెట్లు అవుతాయి. తెలంగాణ ఎగ్జిబిటర్ల నుంచి థియేటర్ల ప్రతిపాదన రాలేదు. ఇద్దరు దర్శకులు, ఇద్దరు నిర్మాతలే దీని వెనుక ఉన్నారు. టైమ్ వచ్చినప్పుడు పేర్లు చెబుతాను’ అని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
హీరోలు అంటే దేవుళ్లు
సినీ పెద్దల ఆగ్రహాన్ని చల్లబరిచే ప్రయత్నంలో భాగంగానే సునీల్ నారంగ్ రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్ సినిమాతో పాటు మా కుబేర సినిమా కూడా అదే సమయంలో విడుదలవుతుండగా, మేం థియేర్లను మూయాలని ఎందుకు అనుకుంటాం అని ప్రశ్నించారు. డిజిటల్ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూల్లో సైతం ఆయన హీరోలను ఆకాశానికి ఎత్తారు. ‘మనదేశంలో డబ్బున్నోళ్లు చాలామంది ఉన్నారు. కానీ హీరోలవ్వలేదు. కోటి మందిలో ఒక హీరో పుడతాడు. వాళ్లు దేవుళ్లు. హీరో అవ్వడం అంత వీజీ కాదు. 145 కోట్ల జనాభాలో 40 మంది హీరోలున్నారు’ అంటూ స్పందించారు. తాజా వివాదానికి ఆజ్యం పోసిన శ్రీధర్ వ్యాఖ్యలతోనూ తనకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ‘శ్రీధర్ చెప్పిన మాట వినడు. నిన్న నేను ఆయన్ను చూసి వెనక్కు వెళుతుంటే బలవంతంగా తీసుకెళ్లి ప్రెస్మీట్లో కూర్చోబెట్టారు. ఆయనకు ఎవరు రాసిచ్చారో, ఆయనతో ఎవరు అలా మాట్లాడించారో నాకు తెలియదు. నేను ప్రెసిడెంట్ని, ఆయన సెక్రటరీ... కాబట్టి నా పక్కన కూర్చోని మాట్లాడాడు. దాంతో నాకేం సంబంధం లేదు. ఆయన మాటల వెనుక నా ప్రోద్బలం ఉండి ఉంటే మీడియా సమావేశంలో ఆయన పక్కన ఎందుకు కూర్చుంటాను. అసలు ప్రెస్మీట్లో ఆయన ఏం మాట్లాడతాడనేది కూడా నాకు తెలియదు. ఆయన మాటలతో నేను షాక్కు గురయ్యాను. ‘హీరోలు ఎన్ని సినిమాలు చేయాలో చెప్పడానికి నువ్వెవరు’ అన్నాను. ఆయనకు మాట్లాడడం రాదు. నా స్నేహితుడు అయినంత మాత్రాన ఆయన ఏం చేసినా దానికి నేను పూచీ కాదు’ అని బదులిచ్చారు.
అందుకే హీరోలతో కలసి థియేటర్ల నిర్మాణం
‘మల్టీప్లెక్స్ల్లో రెండు సినిమాలు విడుదలైతే ఒకటి ప్లాప్ అయినా, ఒకటి హిట్ అవుతుంది. దానికి షోలు పెంచుతాం. సేఫ్ అయిపోతాం. సింగిల్ థియేటర్లో వేసిన సినిమా ప్లాప్ అయితే ఇక ఏం చేయలేం. అందుకే టాలీవుడ్ అగ్రహీరోలతో కలసి థియేటర్ల నిర్మాణం చేపట్టాం. అది భాగస్వామ్య వ్యాపారం. అందులో తప్పేం ఉంది. ప్రాజెక్ట్కి క్రేజ్ వస్తుంది. అలాంటి ఆలోచనతో ఇంకెవరూ వెళ్లలేదు. మేం వెళ్లాం. వాళ్లు ఓకే చేశారు. ఆ స్టార్కి కూడా లాభం ఉంటుంది. పైగా ఇలాంటి మల్టీప్లెక్స్లు పది కట్టుకుంటే ‘ఆ నలుగురు’, గుత్తాధిపత్యం లాంటి నిందలు అన్నీ పోతాయి’ అన్నారు.