Spirit: నిరీక్షణ ముగిసింది.. పట్టాలెక్కిన ప్రభాస్ 'స్పిరిట్'
ABN , Publish Date - Nov 24 , 2025 | 08:06 AM
ప్రభాస్ ‘స్పిరిట్’ షూట్ ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ (Spirit) ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. వారి నిరీక్షణకు తెరదించుతూ ఆదివారం ఈ చిత్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ బేనర్లపై భూషణ్కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శక్తిమంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్. త్రిప్తీ దిమ్రీ (Triptii Dimri) కథానాయిక. ప్రకాశ్రాజ్, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తొమ్మిది భాషల్లో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల కానుంది. ఎలాంటి విజువల్స్ లేకుండా ప్రభాస్ పుట్టినరోజున విడుదల చేసిన సౌండ్ స్టోరీ’ ఆడియో టీజర్ సినిమాలపై అంచనాలను రెట్టింపు చేసిన విషయం తెలిసిందే.