Tollywood: మంచి నిర్మాత మహేంద్ర మరిలేరు

ABN , Publish Date - Jun 12 , 2025 | 09:02 AM

సీనియర్ నిర్మాత కె. మహేంద్ర గుంటూరులో అనారోగ్యంతో బాధపడుతు బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా రంగంతో దాదాపు ఐదున్నర దశాబ్దాల అనుబంధం వారిది.

తెలుగు సినిమా రంగానికి మరో సీనియర్ నిర్మాత వీడ్కోలు పలికారు. ఐదున్నర దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా రంగంలో వివిధ శాఖలలో అనుభవం గడించి, నిర్మాతగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కావూరి మహేంద్ర (79) (K. Mahendra) అనారోగ్యంతో గుంటూరులో కన్నుమూశారు. గుడివాడ తాలుకు దోసపాడులో 1946లో మహేంద్ర జన్మించారు. తండ్రి అచ్యుతరామయ్య డీఎస్పీగా గుంటూరులో పనిచేయడంతో వారి కుటుంబం అక్కడే స్థిరపడింది. ఏలూరు, విజయవాడ, హైదరాబాద్, ఒంగోలులో విద్యాభ్యాసం నెరపిన మహేంద్ర 1966లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆయన బంధువు తాతినేని ప్రకాశరావు (Thathineni Prakasarao) సలహా మేరకు కె. ప్రత్యగాత్మ (K Pratyagathma), ఆయన సోదరుడు కె. హేమాంబరధర రావు వద్ద కొన్ని సినిమాలకు దర్శకత్వ శాఖలో మహేంద్ర పనిచేశారు. ఆపైన 'అదృష్ట జాతకుడు, వింత దంపతులు, ఇంటిదొంగ, పరివర్తన' చిత్రాలకు ప్రొడక్షన్ కంట్రోలర్ గా వ్యవహరించారు. 1977లో 'ప్రేమించి పెళ్ళి చేసుకో' సినిమాతో నిర్మాతగా మారారు.

చాలా యేళ్ళ పాటు ఆయన గీతా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై సినిమాలను నిర్మించారు. 'ఏది పాపం ఏది పుణ్యం, ఆరని మంటలు, తోడు దొంగలు, బందిపోటు రుద్రమ్మ, ఎదురలేని మొనగాడు, ఢాకూరాణి, ప్రచండ భైరవి, కనకదుర్గ వ్రత మహాత్మ్యం, అమ్మలేని పుట్టిల్లు' తదితర చిత్రాలను మిత్రులతో కలిసి ప్రొడ్యూస్ చేశారు.


క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న శ్రీహరి (Sriharini)ని హీరోగా పరిచయం చేస్తూ 'పోలీస్' (Police)సినిమాను నిర్మించి, శ్రీహరికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఆ తర్వాత ఆయనే శ్రీహరి హీరోగా రెండో సినిమా 'దేవా' (Deva)ను ప్రొడ్యూస్ చేశారు. హీరోగా శ్రీహరి స్థిరపడిన తర్వాత 'ధ్యాంక్యూ సుబ్బారావు, కూలీ, ఒక్కడే' చిత్రాలను నిర్మించారు. తేజ దర్శకత్వంలో కె. మహేంద్ర నిర్మించిన 'లక్ష్మీ కళ్యాణం' (Lakshmi Kalyanam) ద్వారానే కాజల్ (Kajal) కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టింది. ఇవాళ్టి ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని... కె. మహేంద్ర చిత్రాలలోనే దర్శకత్వ శాఖలో పనిచేశారు. చివరగా రాజశేఖర్ (Rajasekhar) ద్విపాత్రాభినయంలో కన్మణి దర్శకత్వంలో 'అర్జున' సినిమాను మహేంద్ర నిర్మించారు. ఇది విడుదలకు నోచుకోలేదు. దానితో ఆర్థిక పరమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో కె. మహేంద్ర పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు.

కె. మహేంద్రకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. వారి కుమార్తెను విప్లవ చిత్రాల కథానాయకుడు, స్వర్గీయ మాదాల రంగారావు (Madala Rangarao) కుమారుడు మాదాల రవి (Madala Ravi) వివాహం చేసుకున్నారు. కె. మహేంద్ర కుమారుడు జీతు తండ్రి బాటలో నిర్మాతగా మారి, కొంతకాలం క్రితం అనారోగ్యంతో మరణించారు. కొన్ని సంవత్సరాలుగా గుంటూరులోనే ఉంటున్న మహేంద్ర బుధవారం రాత్రి రమేశ్‌ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తనువు చాలించారు. గురువారం గుంటూరులోనే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Jun 12 , 2025 | 09:56 AM