Padaharu Rojula Panduga: డి.యస్. రావు తనయుడు హీరోగా సినిమా...
ABN , Publish Date - Nov 26 , 2025 | 05:08 PM
నిర్మాత, నటుడు దమ్మాలపాటి శ్రీనివాసరావు తనయుడు సాయికృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. సాయికృష్ణతో 'పదహారు రోజుల పండుగ' పేరుతో సాయికిరణ్ అడవి ఓ సినిమాను రూపొందిస్తున్నాడు.
'వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత' వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన సాయికిరణ్ అడివి (Saikiran Adivi) తాజా చిత్రం 'పదహారు రోజుల పండుగ' (Padaharu Rojula Panduga). ఈ సినిమాతో నిర్మాత, నటుడు డి.ఎస్. రావు (D.S. Rao) తనయుడు సాయికృష్ణ దమ్మాలపాటి (Saikrishna Dammalapati) హీరోగా పరిచయం అవుతున్నాడు. గోపికా ఉదయన్ (Gopi Udayan) హీరోయిన్. ఈ చిత్రంలో రేణు దేశాయ్ (Renu Desai), అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), 'వెన్నెల' కిశోర్ (Vennela Kishore) ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సురేశ్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. బుధవారం జరిగిన పూజా కార్యక్రమాలకు హాజరైన కోన వెంకట్, కె. కె. రాధామోహన్ నిర్మాతలకు స్క్రిప్ట్ ఇచ్చారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Shekar Kammula) క్లాప్ కొట్టారు. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి సురేశ్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అల్లు అరవింద్, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్, దామోదర ప్రసాద్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రారంభోత్సవం తర్వాత సాయికిరణ్ అడివి మాట్లాడుతూ, 'ఈ సినిమాకు 'పదహారు రోజుల పండుగ' అనే టైటిల్ ను కృష్ణవంశీ (Krishna Vamsi) సజెస్ట్ చేశారు. ఈ కథ ఆయనకు బాగా నచ్చడంతో దీనిని సూచించారు' అని అన్నారు. సాయికిరణ్ అడివి ఈ కథను లాక్ డౌన్ కు ముందే తనకు చెప్పారని, ఇందులో అత్తమ్మ పాత్రను చేస్తున్నానని రేణు దేశాయ్ చెప్పారు. సాయికిరణ్ అడివి దర్శకత్వంలో తాను హీరోగా తొలి చిత్రం చేయడం ఆనందంగా ఉందని సాయికృష్ణ తెలిపాడు. ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం పట్ల హీరోయిన్ గోపికా ఉదయన్ హర్షం వ్యక్తం చేసింది. అనసూయ భరద్వాజ్, రామ్, లక్ష్మణ్, జానీ మాస్టర్ ఈ సినిమాలో వర్క్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. తమ 'పదహారు రోజుల పండుగ' సినిమా వందరోజులు ఆడాలని నిర్మాత సురేశ్ కుమార్ ఆకాంక్షించారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Janhvi Kapoor: జాన్వీకి డూప్గా మరో హీరోయిన్
Also Read: Tollywood: చలసాని గోపీ.. తనయుడు కన్నుమూత