Rashmika Mandanna: సమీరా.. ఓ అందమైన గందరగోళం లాంటిది.
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:59 PM
‘కుబేర’ చిత్రంలో రష్మిక సమీరా పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఈ సినిమాకు, ఆమె పాత్రకు వస్తున్న స్పందన గురించి ఆమె స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
"నాగార్జున సర్ (Nagarjuna) గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆయన నుంచి నేనెంతో స్ఫూర్తి పొందాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ది బెస్ట్. ఆయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం’’ అని నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) అన్నారు. తాజాగా ఆమె ‘కుబేర’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. శేఖర్ కమ్ముల (Sekhar kammula) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున, ధనుష్ కీలక పాత్రధారులు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. ఇందులో రష్మిక సమీరా పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఈ సినిమాకు, ఆమె పాత్రకు వస్తున్న స్పందన గురించి ఆమె స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
‘‘శేఖర్ కమ్ముల వల్లే సమీరా పాత్రలో అంతగా ఒదిగిపోగలిగాను. వృత్తిపై ఆయనకున్న ప్రేమ తన సినిమాల్లో ఎప్పుడూ కనిపిస్తుంటుంది. అందుకే ఆయనతో కలిసి వర్క్ చేయాలని చాలాకాలంగా అనుకుంటున్నా. ‘కుబేర’తో నాకు అవకాశం దొరికినప్పుడు.. ఒక నటిగా ఆయన నాకు పూర్తి ేస్వచ్ఛనిచ్చారు. అందుకే ఆయన చెప్పిన విధంగా ప్రతి సన్నివేశంలో యాక్ట్ చేయగలిగాను. ఆయన వల్లే ఈరోజు నాకు ఇంతటి ప్రశంసలు దక్కుతున్నాయి. అద్భుతమైన వారితో పనిచేసినప్పుడు వారికి సమానంగా యాక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ధనుష్ లాంటి గొప్ప నటుడు పక్కన యాక్ట్ చేస్తున్నప్పుడు.. ప్రతి సీన్లో శ్రమించాల్సిందే. దేవాతో కలిసి సమీరా పాత్రలో నటించినందుకు ఎంతో సంతోషిస్తున్నా. సమీరా.. ఒక అందమైన గందరగోళం లాంటిది. సినిమా చూసిన తర్వాత నేను ఎందుకు ఇలా చెబుతున్నానో మీరే అర్థం చేసుకుంటారు’’ అని ఆమె రాసుకొచ్చారు.