SSMB29: మహేశ్‌ సినిమా... ఎంతైనా తగ్గేదేలే..

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:19 PM

గుణశేఖర్‌ తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి. అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు. బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు

బాలీవుడ్‌లో భారీ కాన్వాస్‌ కథలు, సెట్లు, కళాత్మక పంథాలో చిత్రాలను తెరకెక్కించడం అంటే గుర్తొచ్చే పేరు సంజయ్‌ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali). దేవదాస్‌ సినిమా కోసం ఏకంగా 50 కోట్ల బడ్జెట్‌తో భారీ సెట్‌ నిర్మించారని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. అది తెరపై కనిపించింది. ఆయన తీసే సినిమా బడ్జెట్‌లో 15 నుంచి 35 కోట్లు సెట్స్‌ కోసం ఖర్చవుతుంది. బాజీరావు మస్తానీ, ప్రేమ్‌ రతన్‌ ధన్‌ సాయో, రామ్‌ లీలా, హీరామండి ఇవన్నీ ఆ కోవకు చెందినవే. అలాగే టాలీవుడ్‌ అలా భారీ సెట్స్‌ వేసే అలవాటు దర్శకుడు గుణశేఖర్‌కు (Guna sekhar) ఉంది. ఎందుకంటే ఆయన ఎంచుకునే కథల స్పాన్‌ అలా ఉంటుంది. ఒక్కడు, వరుడు సహా చాలా సినిమాలకు గుణశేఖర్‌ భారీతనంతో నిండిన సెట్స్‌కు కోట్లు ఖర్చు చేశారు. రుద్రమదేవి లాంటి సినిమా కోసం పూర్తి స్థాయి బడ్జెట్‌ లభించకపోవడంతో ఆ సినిమా అవుట్‌పుట్‌ కాస్త డల్‌గా వచ్చింది.

ఆయన తర్వాత అలా భారీతనంతో సెట్స్‌ వేయడంలో రాజమౌళి (SS Rajamouli) ఘనాపాటి. అయితే ఆయనకు ఆర్థిక వనరుల దృష్య్టా ఎలాంటి సమస్య లేదు. బెస్ట్‌ అవుట్‌పుట్‌ కోసం ఆయన ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు. ఇప్పుడు మహేశ్‌ సినిమా కోసం భారీ సెట్స్‌ నిర్మిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ఆయన మహేష్‌ కథానాయకుడిగా ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వారణాసిలో కీలక షెడ్యూల్‌ చేయాలట. నిజానికి గంగానది ఒడ్డున రియల్‌ లొకేషన్లలో ఇలాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించాలంటే సవాల్‌తో కూడిన విషయమే!  పోలీసుల నుంచి అనుమతులు పొందడం అంత సులువు కాదు. దాంతోపాటు ప్రజలు,  ప్రజల నుంచి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అది కష్టంతో కూడిన పని కావడంతో రాజమౌళి వారణాసిని తలపించే భారీ సెట్‌ని నిర్మించాలని ప్లాన్‌ చేసినట్టు తెలిసింది. వారణాసిలో దేవాలయాలు, ఘాట్‌లతో ఆధ్యాత్మికత నిండిన ప్రాంతంగా ఉంటుంది. అలాంటి నగరాన్ని నిర్మించాలనే ఆలోచన సవాళ్లతో కూడుకున్నదే! తెరపై ఒరిజినాలిటీ చూపించాలి. దాని కోసం రాజమౌళి టీమ్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌తో కసరత్తులు చేస్తున్నారని తెలిసింది.   పర్వతాలలో సంజీవని వనమూలికలు వెతకడానికి వెళ్ళిన హనుమంతుడు స్ఫూర్తితో ఈ కథను రూపొందించారని తెలుస్తోంది. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో నిర్మాత కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. 

Updated Date - Jun 19 , 2025 | 12:20 PM