Nandamuri Balakrishna: వారణాసిలో.. 'అఖండ' జాతర
ABN , Publish Date - Dec 18 , 2025 | 07:55 PM
డిసెంబర్ 12వ తేదీన థియేటర్లలోకి వచ్చిన అఖండ 2 మంచి వసూళ్లతో దూసుకుపోతున్న తరుణంలో, బాలకృష్ణ, బోయపాటి శ్రీను వారణాసి చేరుకున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ 2: తాండవం (Akhanda 2 Thandavam) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే రూ. 59.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. ఇక ఇప్పటివరకు అఖండ 2 తాండవం 200 కోట్ల వరకు కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది.
14 రీల్స్ (14 Rels) బ్యానర్ పై రామ్ ఆచంట (Ram Aachanta), గోపి ఆచంట (Gopi Aachanta) నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ (S.S Thaman) సంగీతం అందించారు. సంయుక్త మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటించగా..ఆది పినిశెట్టి (Adhi Pinisetty) విలన్ పాత్రలో మెప్పించారు. హర్షాలీ మల్హోత్రా (Harshali Malhotra), శశ్వత చటర్జీ (Shashwata Chatterjee), పూర్ణ(Poorna), జగపతి బాబు(Jagapathi Babu), సర్వదమన్ బెనెర్జీ (Sarvadaman Banerjee) కీలక పాత్రల్లో నటించారు.
డిసెంబర్ 12వ తేదీన థియేటర్లలోకి వచ్చిన అఖండ 2 మంచి వసూళ్లతో దూసుకుపోతున్న తరుణంలో, సినిమాను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు గాను చిత్ర బృందం ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో అడుగుపెట్టింది. అఖండ 2: తాండవం' ప్రమోషన్స్ లో భాగంగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను వారణాసి చేరుకున్నారు. మొదట అక్కడ కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గంగా హారతిలో కూడా వారు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. వారణాసి పర్యటన ముగించుకున్నాక మరికొన్ని ప్రధాన నగరాల్లో కూడా 'సక్సెస్ టూర్' నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.