Geetanjali: మళ్ళీ థియేటర్స్కు.. నాగార్జున 'గీతాంజలి'
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:08 PM
అక్కినేని నాగార్జున కెరీర్ లో బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ 'గీతాంజలి'. ఈ సినిమాను రీ-రిలీజ్ చేయడానికి తాజాగా దీని హక్కులను సొంతం చేసుకున్న బూర్లె శివప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.
భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై సి. పద్మజ (Proprietor) నిర్మించిన 'గీతాంజలి' (Geethanjali) చిత్రం 1989లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ (చెన్నై మినహాయించి) రీ-రిలీజ్ హక్కులని శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గతంలోనే పొందారు. మణిరత్నం (Manirathnam) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), గిరిజ షట్టర్ హీరోహీరోయిన్లుగా నటించగా, విజయకుమార్, సుమిత్ర, విజయ్ చందర్, డిస్కో శాంతి, సుత్తివేలు, ముచ్చర్ల అరుణ్, షావుకారు జానకీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ సంగీత ప్రియుల పెదాలపై ఈ పాటలు నర్తిస్తూనే ఉంటాయి. 'గీతాంజలి' సినిమాను 4 కె డిజిటల్ లో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రీ-రిలీజ్ చేయబోతున్నారు. ఈ అద్భుతమైన ఈ చిత్రాన్ని ఎంతో ప్రేమతో ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉందని బూర్లె శివప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.