రెండు భారీ ప్రాజెక్ట్స్
ABN , Publish Date - Jun 24 , 2025 | 03:20 AM
కొమరం భీమ్ రగులుతున్న భారతం తథాగత బుద్ధ వంటి చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు అల్లాణి శ్రీధర్ ఇప్పుడు మరో రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి...
‘కొమరం భీమ్’, ‘రగులుతున్న భారతం’, ‘తథాగత బుద్ధ’ వంటి చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు అల్లాణి శ్రీధర్ ఇప్పుడు మరో రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నిజాం అణచివేత పాలనని వ్యతిరేకించిన గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ జీవిత కథ ఆధారంగా శ్రీధర్ ‘కొమరం భీమ్’ చిత్రాన్ని రూపొందించారు. 1940లలో ఆదిలాబాద్లో జరిగిన గోండుల పోరాట నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదలకు ముందే రెండు నంది అవార్డులు పొందడం విశేషం. అలాగే అక్కినేని, దాసరి వంటి దిగ్గజాలు నటించిన ‘రగులుతున్న భారతం’ సినిమాకు కూడా శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఇక ఆయన రూపొందించిన ‘తథాగత బుద్ధ’ చిత్రం తెలుగు హిందీ భాషల్లో రూపుదిద్దుకొని ప్రేక్షకులను అలరించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ అవార్డ్స్ విధివిధానాల కమిటీలో సభ్యునిగా సేవలు అందించిన శ్రీధర్ ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్ట్స్ చేపట్టారు. వాటి గురించి ఆయన వివరిస్తూ ‘వర్చువల్ వన్’ అనే ప్రముఖ సంస్థతో కలసి ఓ భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తీసే సన్నాహాల్లో ఉన్నాం.
అలాగే సి.కల్యాణ్ సమర్పణలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించే చిత్రం కూడా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. అదే విధంగా ‘ఫిల్మిండియా డిజిటల్ కంటెంట్’ పేరుతో ఓ కొత్త సంస్థ ప్రారంభించాను. కోరిన వారికి అవసరమైన డిజిటల్ కంటెంట్ను రూపొందించి, అందిస్తాం. ప్రేక్షకులకు మంచి కథలు, వినూత్న అంశాలతో చిత్రాలు అందించాలని మా ప్రయత్నం’ అన్నారు.