Theatres bundh: దిల్ రాజు వివరణ
ABN , Publish Date - May 26 , 2025 | 04:38 PM
సినిమా థియేటర్ల బంద్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై దిల్ రాజు స్పందించారు. ఆ నలుగురు అంటూ తనను మీడియా ప్రచారంలో వాడుకోవడాన్ని ఖండించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తన దగ్గర కేవలం 50 థియేటర్లు ఉన్నాయని తెలిపారు.
ప్రముఖ నిర్మాత, పంపిణీ దారుడు, ఎగ్జిబిటర్, తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు థియేటర్ల బంద్ విషయమై కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చపై స్పందించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా సోమవారం ఉదయం సినిమా రంగానికి అండగా ఉంటామని ప్రకటించిన ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివాదానికి ఆయన ఓ రకంగా ఫుల్ స్టాప్ పెట్టారని అన్నారు. మీడియా సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ, 'తొమ్మిది రోజులుగా జరుగుతున్న ఓ ఇష్యూని కన్ క్లూజ్ చేయడం ఆనందంగా ఉంది. మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఫుల్ స్టాప్ పడిందని అనుకుంటున్నాను.
ఏప్రిల్ 19న తూర్పు గోదావరిలోని పంపిణీదారులు, ఎగ్జిబిటర్స్ ఏర్పాటు చేసుకున్న మీటింగ్ లో పర్సెంటేజ్ విధానంలో ఆడితే తమకు బాగుంటుందని థియేటర్ ఓనర్స్ చెప్పారు. ఇవాళ యేడాదికి 150 సినిమాలు విడుదలైతే, 90 శాతం పర్సంటేజ్ సిస్టమ్ లోనే ప్రదర్శితమౌతున్నాయి. కొన్ని సినిమాలే రెంట్ లేదా పర్సంటేజ్ కు ఆడుతున్నారు. ఆ విషయంలోనే ఎగ్జిబిటర్స్ అభ్యంతరం చెబుతున్నారు. ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ తమ నిర్ణయాన్ని హైదరాబాద్ లోని ఎగ్జిబిటర్స్ కు తెలిపారు. దీనిపై ఏప్రిల్ 26న జరిగిన గిల్డ్ మీటింగ్ లో మేం చర్చించాం. ఆరు నెలల పాటు వారి ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుని నిజంగా నష్టం వస్తోందనిపిస్తే, తప్పకుండా వారికి సాయం చేద్దామని మేం అనుకున్నాం. సహజంగా పెద్ద సినిమాలకు మొదటివారం రెంట్ ఇస్తున్నాం. ఆ తర్వాత పర్సెంటేజ్ ఇస్తున్నాం. ఇది కొందరు ఎగ్జిబిటర్స్ కు నచ్చడం లేదు. మేం ఈ విషయాల గురించి గిల్డ్ లో మాట్లాడే సమయానికి 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. కాబట్టి ఇది ఆ సినిమా వ్యతిరేకంగా జరిగిన నిర్ణయం అనేది కరెక్ట్ కాదు. ఇక థియేటర్ల విషయానికి వస్తే... నైజాంలో 370 సింగిల్ స్క్రీన్ ఉంటే మాకు, మా మిత్రులకు కలిపి 30 థియేటర్లు ఉన్నాయి. ఏసియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్, సురేశ్ బాబుకు వాళ్ళకు 90 ఉన్నాయి. మిగిలిన వాటిని ఓనర్స్ లేదా వారి సంబంధీకులు నడుపుతున్నారు. మా గిల్డ్ మీటింగ్ తర్వాత తెలంగాణలోని సింగిల్ థియేటర్స్ ఓనర్స్ కూడా పర్సంటేజ్ గురించి శిరీష్ ను అడిగారు. అతను నా దృష్టికి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే... మే 18న ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ చివరిలో నేను వెళ్ళాను. ఆ రోజున మీటింగ్ లో ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే 'జూన్ 1 నుండి థియేటర్స్ బంద్' అనే ప్రచారం మీడియాలో మొదలు పెట్టారు. నిజానికి ఆ సమస్యను ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లమని చెప్పాను. ఎగ్జిబిటర్స్ కూడా త్వరలో జరుగబోయే జాయింట్ కమిటీ మీటింగ్ లో తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోతేనే థియేటర్లు బంద్ చేస్తామని చెప్పారు. కానీ అప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తప్పుడు ప్రచారం అంతటా జరిగిపోయింది. అయితే ఆ తర్వాత నిర్మాతలు, పంపిణీ దారులు జరుపుకున్న మీటింగ్ లో థియేటర్ల బంద్ చేయకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ఎగ్జిబిటర్స్ తో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం తీసుకుందామని భావించారు. ఈ నెల 30న జరిగే ఛాంబర్ ఈసీ మీటింగ్ ఓ కమిటీని ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటారు' అని దిల్ రాజు తెలిపారు.
కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు
ఈ మొత్తం వ్యవహారంలో అనవసరంగా 'హరిహర వీరమల్లు' మూవీని లాగారని దిల్ రాజు వాపోయారు. కళ్యాణ్ గారి సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని తెలిపారు. సినిమా వాళ్ళకు రెండు ప్రభుత్వాలతో పని ఉంటుందని, ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత సినిమా వాళ్ళకు చాలా చక్కని యాక్సెస్ లభించిందని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలోనూ తనకు ఇరవై థియేటర్లు ఉన్నాయని చెప్పారు. సినిమా రంగానికి ప్రభుత్వాలతో ఖచ్చితంగా పని ఉంటుందని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మాకు అండగా ఉండాలని కోరుకుంటామని అన్నారు. కొందరు ఆయనకు సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్లే పవన్ కళ్యాణ్ కోపానికి గురయ్యారని అన్నారు. ఒకవేళ ఆయన తిట్టినా పడతామని, పెద్దన్న స్థానంలో ఉన్న ఆయనకు ఆ హక్కు ఉందని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఏకాభిప్రాయం లేని కారణంగానే చాలా సమస్యలు వస్తున్నాయని, తమ గిల్డ్ లోనే కాకుండా... ప్రతి చోట ఈ సమస్య ఉంద'ని దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నిర్మాతలు సైతం 'గేమ్ ఛేంజర్' పైరసీని నేనే చేశానంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారని, ఎవరైనా తమ సినిమాను తాము చంపుకుంటారా అని దిల్ రాజు అన్నారు.
Also Read: Venky - Trivikram Movie: రుక్మిణీ వసంత్ కు గోల్డెన్ ఛాన్స్...
Also Read: Senior Stars: సీనియర్స్ రొమాన్స్ ఎబ్బెటగ్గా ఉంటోందా...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి