Chai Shots: షాట్స్ లవర్స్ కోసం.. తెలుగులో కొత్త ఓటీటీ, యాప్
ABN , Publish Date - Dec 08 , 2025 | 08:50 PM
డిజిటల్ మీడియాలో యువతకు నచ్చే వినూత్న కంటెంట్ను అందిస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన చాయ్ బిస్కెట్ మరో పెద్ద అడుగు వేసింది.
డిజిటల్ మీడియాలో యువతకు నచ్చే వినూత్న కంటెంట్ను అందిస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన చాయ్ బిస్కెట్ (Chai Bisket) మరో పెద్ద అడుగు వేయడానికి సిద్ధమైంది. సోమవారం హైదరాబాద్ పార్క్ హాయత్లో ఓ ఈవెంట్ నిర్వహించి అధికారికంగా ‘చాయ్ షాట్స్’ (Chai Shots) పేరుతో భారతదేశంలోనే తొలి ప్రాంతీయ షార్ట్-సిరీస్ OTT ప్లాట్ఫార్మ్, యాప్ను లాంచ్ చేశారు. ఈ వేడుకకు రానా దగ్గుబాటి, మైత్రీ మూవీ మేకర్స్ రవి వంటి సెలబ్రిటీస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హజరయ్యారు.
నేటి యూత్ టేస్ట్కు అనుగుణంగా, తక్కువ వ్యవధిలో ఆకట్టుకునే కథలను అందించడమే లక్ష్యంగా ఈ ప్లాట్ఫార్మ్ రూపుదిద్దుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే 100కి పైగా ఒరిజినల్ షోలను, అది కూడా తెలుగులోనే, ప్రేక్షకులకు అందించేందుకు చాయ్ షాట్స్ సిద్ధమవుతోంది.
2015లో శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిఅ అధ్వర్యంలో చిన్నపాటి సంస్థగా స్థాపించబడిన చాయ్ బిస్కెట్, హైదరాబాద్ను కేంద్రంగా లోకల్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ రంగంలో అగ్రగామిగా ఎదిగింది. యూట్యూబ్ ఛానెల్లు మరియు ఇతర కంటెంట్ ప్లాట్ఫార్మ్ల ద్వారా ఇప్పటివరకు 2 బిలియన్కు పైగా వ్యూస్ను సాధించగా, నెలకు సుమారు 50 మిలియన్ వీడియో వ్యూస్ను అందుకుంటుండడం విశేషం.
ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. ‘మన ప్రేక్షకులకు టీవీ తప్పితే ఓటీటీలు పరిచయం లేని కాలంలో నేను‘ఛాయ్ బిస్కట్’ వ్యవస్థాపకులు శరత్, అనురాగ్ను కలిశాను. వీళ్లకున్న ప్రతిభ, తెలివితేటలు, దృక్పథం అపారమైనవి. వీరు ప్రారంభించిన ఈ ప్రయాణం అందరికీ ఎంతో మేలు చేస్తుంది. నేను ఈ కొత్త ప్రయత్నానికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తానని, ఇందులో ఉన్న కంటెంట్ సినిమాల్లాగే విజయవంతం కావాలని కోరుకుంటున్నా అని అన్నారు.
‘ఇది మా జీవితంలో కొత్త ఛాప్టర్. భావోద్వేగాలకి కనెక్ట్ కావడం మనం కథల నుంచే నేర్చుకున్నాం. కథలు మన జీవితంలో ముఖ్యభాగం’ అని శరత్ తెలిపారు. ‘మేము చేసిన ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అని అనురాగ్ పేర్కొన్నారు. ‘రెండు నిమిషాల లోపు కథలను కొత్తగా చెప్పేలా కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించే ఈ యాప్ అందరికీ చేరువవుతుంది. భారత దేశంలో వినోదం విభాగంలో ప్రభంజనాన్ని సృష్టిస్తుంది’ అని నిర్మాత వై.రవిశంకర్ అన్నారు.