Celebs to Appear: బెట్టింగ్‌ యాప్‌ల కేసు

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:01 AM

బెట్టింగ్‌ యాప్‌ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోషన్స్‌ చేసిన సినీ నటులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీచేసింది...

  • రానా, ప్రకాశ్‌రాజ్‌, విజయ్‌ దేవరకొండకు నోటీసులు

  • మంచు లక్ష్మికి కూడా.. రేపు ఈడీ ముందుకు రానా

  • ఆ తర్వాతి వరుసలో ప్రకాశ్‌ రాజ్‌

బెట్టింగ్‌ యాప్‌ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోషన్స్‌ చేసిన సినీ నటులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు జారీచేసింది. యాప్‌ల ప్రమోషన్ల వ్యవహారంలో మనీలాండరింగ్‌ జరిగిందనే కోణంలో ఈడీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. మొత్తం 29 మంది సినీనటులు, యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) నమోదు చేసిన ఈడీ.. తాజాగా నోటీసులు జారీచేసింది. ఈ నెల 23న తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ దగ్గుబాటి రానాకు నోటీసులు జారీ అయ్యాయి. జూలై 30న ప్రకాశ్‌రాజ్‌, ఆగస్టు 6న విజయ్‌ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మిని తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి జారీ చేసిన నోటీసుల్లో స్పష్టం చేశారు. బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోషన్‌ చేయడానికి కారణాలేంటి? వీరికి రెమ్యునరేషన్‌ ఏ రూపంలో అందింది? తదితర అంశాలపై ఈడీ వీరి వాంగ్మూలాన్ని రికార్డు చేయనుంది. హవాలా, మనీలాండరింగ్‌ కోణాలపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. సినీ నటుల మాటలు నమ్మి లక్షల మంది అమాయకులు బెట్టింగ్‌ యాప్‌ల వలలో పడి, నిలువుదోపిడీకి గురైన విషయం తెలిసిందే..! కొందరైతే ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు.

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి)

Updated Date - Jul 22 , 2025 | 06:02 AM