Nandamuri Balakrishna: అంకెలతో పనిలేదు.. అర్థం చేసుకుని ముందుకు సాగడమే
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:43 AM
తానేంటో రాబోయే రోజులలో చూస్తారని, పట్టుదలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆయన 65వ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం బసవతారకం...
తానేంటో రాబోయే రోజులలో చూస్తారని, పట్టుదలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఆయన 65వ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించారు. సంస్థ ఆవరణలో ఉన్న దివంగత నందమూరి తారక రామారావు, బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆస్పత్రి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారీ కేక్ కట్ చేసి క్యాన్సర్తో పోరాడుతున్న చిన్నారులకు తినిపించారు. ఆ తర్వాత క్యాన్సర్ చికిత్స తీసుకొంటున్న చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ‘ఎటు అడుగు వేసినా ఆ పనిని ప్రేమించి చేయడం నాకు అలవాటు. వయసు కేవలం ఒక నంబర్ మాత్రమే. నా వయసు అందరికీ తెలిసిందే. తల్లితండ్రుల దీవెనలతో 64 ఏళ్లు పూర్తి చేసుకున్నా. నాకు అంకెలతో పని లేదు. నన్ను నేను అర్థం చేసుకుని ముందుకు వెళుతుంటా. ఎప్పటికప్పుడు నా మెదడుకు సాన పెడుతుంటా. తద్వారా పనిలో కొత్తదనాన్ని చూపే ప్రయత్నం చేస్తుంటా. నాన్నగారి కోరిక మేరకు ఒకసారి మెడిసిన్ ఎంట్రెన్స్ రాశా. మెడిసిన్ చదవలేదు కానీ సినిమాల్లో డాక్టర్ పాత్రలు పోషించా. పదిహేనేళ్ల క్రితం ఈ ఆస్పత్రి బాధ్యతలు చేపట్టా. మా అమ్మగారి ఆశయాన్ని నెరవేర్చగలగడం పూర్వజన్మ సుకృతం.
ఈ ఆస్పత్రి ఒక దేవాలయం లాంటిది. ఇక్కడ పని చేస్తున్న వారందరూ భగవంతునితో సమానం. నాకు పద్మభూషణ్ పతకం సినిమా పరంగా ఇచ్చినా దానికి ప్రధాన కారణం బసవతారకం ఆస్పత్రి ద్వారా చేస్తున్న పలు మంచి కార్యక్రమాలే అని భావిస్తున్నా’ అని అన్నారు. ఈ సమావేశం తర్వాత తన అభిమానులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అభిమానులు, రోగులతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. కొత్తగూడెం త్రివేణి స్కూలు యాజమాన్యం, పిల్లలు క్యాన్సర్ రోగుల చికిత్స కోసం అందించిన రూ. 1,01,016 ప్రత్యేక విరాళాన్ని వారి నుంచి స్వీకరించారు. ఇటీవల తనకు భారత ప్రభుత్వం అందజేసిన పద్మభూషణ్ పతకాన్ని ధరించి నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
హైదరాబాద్ సిటీ (ఆంధ్రజ్యోతి)