Akhanda2: అఖండ2 తాండ‌వం.. సినిమా విడుదల వాయిదా

ABN , Publish Date - Dec 05 , 2025 | 04:52 AM

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda2) సినిమా విడుదల వాయిదా పడింది.

Akhanda2

నందమూరి బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda2) సినిమా విడుదల వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్ (14 Reels Plus) అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం సినిమా థియేటర్లలో నేడు విడుదల కావాల్సి ఉంది. దీంతో ఈరోజైనా సినిమా విడుద‌ల అవుతుంద‌ని ఆశ‌ప‌డ్డ అభిమానుల‌కు తీవ్ర నిరాశే ఎదుర‌వ‌డంతో వారు చిత్ర నిర్మాత‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే.. ‘కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్న సమయానికి ‘అఖండ 2’ సినిమాను విడుదల చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. ఈ విషయంలో నిరాశకు గురైన సినీ ప్రేక్షకులను మేము అర్థం చేసుకోగలం. వారందరికీ మా క్షమాపణలు తెలియజేస్తున్నాం. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. త్వరలోనే సానుకూల నిర్ణయంతో మీ ముందుకొస్తాం’ అని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది.

14 reels

విడుదలపై కోర్టు స్టే

గతంలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థతో కలసి ఈరోస్‌ సంస్థ మహేశ్‌బాబు నటించిన ‘వన్‌ నేనొక్కడినే’, ‘ఆగడు’ చిత్రాలను నిర్మించింది. ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నడుస్తోంది. 14 రీల్స్‌ సంస్థ నుంచి తమకు రావాల్సిన రూ.28 కోట్లు బకాయిలు ఇప్పించాలని మద్రాస్‌ హైకోర్టును ఈరోస్‌ సంస్థ ఆశ్రయించింది.

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో భాగస్వాములైన రామ్‌ ఆచంట, గోపీ ఆచంటనే 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టు దృష్టికి తెచ్చింది. తమకు రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లించే వరకు ‘అఖండ’ విడుదలను నిలిపివేయాలని హైకోర్టును కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. దీంతో గురువారం రాత్రి పడాల్సిన ప్రీమియర్‌ షోలు రద్దు అయ్యాయి.

Updated Date - Dec 05 , 2025 | 05:09 AM