AM Rathnam Vs Ambati: అంబటి రాంబాబుకు.. ఏఎం రత్నం అదిరిపోయే కౌంటర్
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:33 PM
పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.
మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ (PawanKalyan) నటించిన హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. పీరియాడిక్ యాక్షన్ జానర్లో రూపొందిన ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం (A. M. Rathnam) భారీ బడ్జెట్తో నిర్మించగా. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. పవన్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలతో ఉన్నప్పటికీ సినిమా సెకండాఫ్పై కొద్దిగా విమర్శలు వచ్చాయి. అంతేగాక టికెట్ ధరలపై కూడా పలువురు కామెంట్లు చేశారు.
ముఖ్యంగా ఈ చిత్రం విడుదల సమయంలో మూడు రోజుల క్రితం వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) తన యూట్యూబ్ ఛానెల్లో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. సినిమాలు సినిమాలే.. రాజకీయాలు రాజకీయాలే అని మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో అందరూ సినిమాను విజయవంతం కావాలని ఆశించారు. నేనూ ‘హరిహర వీరమల్లు’ సూపర్ హిట్ కావాలని ట్వీట్ చేశాను అంటూ చెప్పిన అంబటి రాంబాబు, 'టికెట్ రేట్ల ద్వారా ప్రజలను దోచుకున్నారు' అనే ఆరోపణలు కూడా చేశారు.
ఇప్పుడు ఈ కామెంట్లపై ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సినిమా తీయడం ఎంత కష్టమో అర్థం కావాలంటే సినిమా తీసి చూస్తే తెలుస్తుందని.. రోడ్డెక్కి డ్యాన్స్లు చేస్తే కాదని, సినిమా తీయగలిగితే మాత్రమే మాట్లాడాలి అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేగాక ప్రేక్షకులకు సినిమాపై ఇష్టం ఉంటే వస్తారు, లేదంటే రారు. ఎవరి మీద బలవంతం లేదు. కానీ ఇలా వ్యాఖ్యలు చేయడం సరి కాదని అన్నారు. మీకు సాధ్యమైతే నాతో కలిసి సినిమా తీయాలని, పని చేయాలని ఛాలెంజ్ విసిరారు. అప్పుడే అసలు సినిమా తీసే కష్టమేంటో తెలుస్తుందని ఏఎం రత్నం కౌంటర్ ఇచ్చారు.