Naga Chaithanya: చైతూ... తాత బాటనా... తండ్రి దారిలోనా...
ABN , Publish Date - Jun 07 , 2025 | 02:07 PM
అక్కినేని ఫ్యామిలీకి లవ్ స్టోరీస్ బాగా అచ్చివస్తాయని పేరుంది... ఆ రూటులో మూడు తరాల హీరోలు సక్సెస్ సాధించారు... అయితే ఇప్పుడు నాగచైతన్య పౌరాణిక నేపథ్యమున్న సినిమాలో నటించడం విశేషంగా మారింది... ఏయన్నార్ కెరీర్ స్టార్ట్ అయిందే మైథలాజికల్ మూవీతో... అందువల్ల నాగచైతన్య పౌరాణికం మరింత ఆసక్తి కలిగిస్తోంది
తెలుగునాటనే కాదు ఆల్ ఇండియాలోనే పౌరాణికాలు అంటే చప్పున గుర్తుకు వచ్చేది మహానటుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao)... అయితే ఆయన సమకాలికుడైన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao) పౌరాణిక చిత్రం 'సీతారామజననం'(Sri Seeta Rama Jananam)తోనే ఎంట్రీ ఇచ్చారు... ఆ తరువాత ఏయన్నార్ సోలోగా నటించిన పౌరాణికాలు "చెంచులక్ష్మి (Chenchu Lakshmi) , శ్రీకృష్ణమాయ (Sri Krishna Maya) " అనే చెప్పాలి... ఈ రెండు చిత్రాలలో బి.ఏ. సుబ్బారావు (B. A. Subba Rao) తెరకెక్కించిన 'చెంచులక్ష్మి' మంచి విజయం సాధించింది... ఇక ఏయన్నార్ నటించిన ఇతర పౌరాణిక చిత్రాలు "మాయాబజార్ (Mayabazar), భూకైలాస్ (Bhookailas) , శ్రీకృష్ణార్జున యుద్ధం"(Sri Krishnarjuna Yuddhamu)... వీటిలో యన్టీఆర్ హీరో... అందువల్ల అక్కినేని కెరీర్ పౌరాణికంతోనే ఆరంభమైనా, ఆయన నటించిన పురాణగాథలు తక్కువనే చెప్పాలి... అయితే ఏయన్నార్ "విప్రనారాయణ (Vipra Narayana), మహాకవి కాళిదాసు (Mahakavi Kalidasu), భక్త తుకారాం (భక్త తుకారాం), చక్రధారి (Chakradhari)" వంటి భక్తిరస చిత్రాలలో నటించి అలరించారు... వాటిలోనూ పురాణ నేపథ్యం ఉంటుంది అదీ విశేషం! ఇక 'పెళ్ళినాటి ప్రమాణాలు (Pellinaati Pramanalu), గోవులగోపన్న (Govula Gopanna)" వంటి సాంఘిక చిత్రాలలో కాసేపు కృష్ణుని గెటప్ లో కనిపించారు ఏయన్నార్... బాపు చివరి చిత్రంగా రూపొందిన 'శ్రీరామరాజ్యం (Sri Rama Rajyam) 'లో వాల్మీకి పాత్రలో కనిపించారు అక్కినేని... ఆయన కెరీర్ లో ఇదే చివరి పౌరాణిక చిత్రం కావడం విశేషం!
అలా కొన్ని పురాణగాథల్లోనే నటించిన ఏయన్నార్ ఫ్యామిలీలో ఇప్పుడు నాగచైతన్య (Naga Chaithanya) తదుపరి చిత్రం పౌరాణిక నేపథ్యంతో తెరకెక్కుతూ ఉండడం అభిమానులకు విశేషమనే చెప్పాలి... ఏయన్నార్ నటవారసుడు నాగార్జున (Nagarjuna) సైతం "అన్నమయ్య ( Annamayya) , శ్రీరామదాసు (Sri Ramadasu), నమో వేంకటేశాయ (Om Namo Venkatesaya), షిర్డీ సాయి (Shirdi Sai), జగద్గురు శంకరాచార్య (Jagadguru Shankarachary)" వంటి పురాణ నేపథ్యమున్న చిత్రాలలో నటించి అలరించారు... అందువల్ల నాగార్జున తనయుడు నాగచైతన్య ఇప్పుడు పౌరాణికంలో నటించడం మరింత విశేషంగానే భావిస్తున్నారు అభిమానులు... ఈ సినిమాను కార్తీక్ దండు (Karthik Dandu) దర్శకత్వంలో బీవీయస్ఎన్ ప్రసాద్ (B. V. S. N. Prasad) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నాగార్జున కెరీర్ లోనే 'అన్నమయ్య' సినిమా ఓ ఆణిముత్యంలా నిలచింది... మరి నాగచైతన్య మైథలాజికల్ టచ్ ఉన్న మూవీ తాత బాటలో ఉంటుందా లేక తండ్రి దారిలో సాగుతుందా అన్నది ఓ ప్రశ్న!
తాత, తండ్రి పురాణ నేపథ్యమున్న భక్తిరస చిత్రాలలో నటించి ఆకట్టుకున్నారు... నాగచైతన్య (Naga Chaithanya) తాజా చిత్రం మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లోనే రూపొందుతూ ఉండడంతోనే ఆసక్తి మొదలయింది... భక్తుల పాత్రల్లో మంచి మార్కులు సంపాదించిన ఏయన్నార్, నాగార్జున నటవారసునిగా నాగచైతన్య సైతం అదే తీరున అలరిస్తారేమో చూడాలని అభిమానులు ఇంట్రెస్ట్ గా ఉన్నారు... ఎందుకంటే నందమూరి నటకుటుంబంలో మూడు తరాల స్టార్స్ పూర్తిస్థాయి పౌరాణికాలలో నటించిన ఘనతను సొంతం చేసుకున్నారు... అక్కినేని ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఆ క్రెడిట్ లేదు... ఎందుకంటే నాగార్జున పూర్తిస్థాయి పౌరాణిక చిత్రంలో నటించలేదు... అయితే నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న చిత్రం పూర్తయితే ఏయన్నార్ ఫ్యామిలీలోనూ మూడు తరాల హీరోలు పౌరాణిక నేపథ్యమున్న సినిమాలలో నటించినట్టు అవుతుంది... మరి నాగచైతన్య పురాణగాథలో ఏ తీరున అలరిస్తాడో చూద్దాం...