Vikram Sugumaran: సినీ ఇండస్ట్రీలో విషాదం.. బస్సు ఎక్కుతుండగా గుండెపోటు.. స్టార్ డైరెక్టర్ మృతి
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:30 PM
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ సుగుమారన్(Vikram Sugumaran) గుండెపోటుతో మృతి చెందారు. మధురైలో బస్సు ఎక్కుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు.
సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ సుగుమారన్(Vikram Sugumaran) గుండెపోటుతో మృతి చెందారు. మధురైలో బస్సు ఎక్కుతుండగా ఆయనకు గుండెపోటు రావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే పక్కన ఉన్నవారు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయినట్లు వైద్యులు తెలిపారు. ఇక విక్రమ్ మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
విక్రమ్ సుగుమారన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. డైరెక్టర్ బాలు మహేంద్ర వద్ద అసిస్టెంట్ గా పనిచేసి.. 2013లో మధునాయక్ కూట్టం సినిమాతో డైరెక్టర్ గా తమిళ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలను అందుకున్న ఆయన.. డైరెక్టర్ గానే కాకుండా నటుడుగా కూడా రెండు మూడు సినిమాల్లో నటించారు. ఇక మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్న విక్రమ్ 2023 లో రావణ కోట్టం(Raavana Kottam) సినిమాతో డైరెక్టర్ గా రీఎంట్రీ ఇచ్చారు.
శంతను భాగ్యరాజ్(Shanthanu Bhagyaraj), ఆనంది జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం(Aadujeevitham) సినిమాకు విక్రమ్ మాటల రచయితగా పనిచేశారు. ఇక విక్రమ్ మృతి గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 48 ఏళ్ల వయస్సులోనే ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరమని చెప్పుకొస్తున్నారు.
హీరో శంతను భాగ్యరాజ్.. తన డైరెక్టర్ మరణాన్ని తలుచుకొని సోషల్ మీడియా వేదికగా కన్నీటి పర్యంతమయ్యాడు. "విక్రమ్ సుగుమారన్ అన్నా.. నీ మరణాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక సోదరుడిగా నీ నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నేనెప్పుడూ గుర్తుంచుకుంటాను. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావ్. నిన్ను చాలా మిస్ అవుతున్నాను" అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.