Sudha Kongara: ఆ కాలాన్ని తిరిగి సృష్టించాం.. 1960లో జీవించినట్టుగా ఉంటుంది
ABN , Publish Date - Dec 20 , 2025 | 08:09 AM
తమిళనాడు నుంగంబాక్కంలోని వళ్ళూవర్ కోట్టంలో ‘పరాశక్తి’ సినిమా ఆడియో రిలీజ్ కోసం నిర్మించిన సెట్ ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది.
తమిళనాడు నుంగంబాక్కంలోని వళ్ళూవర్ కోట్టంలో ‘పరాశక్తి’ సినిమా ఆడియో రిలీజ్ కోసం నిర్మించిన సెట్ ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది. 1960 దశకంలో సాగేలా ‘పరాశక్తి’ని రూపొందించారు. సంక్రాంతికి విడుదలకానున్న ఈ చిత్రం ఆడియో గురువారం రాత్రి నగరంలో విడుదల చేశారు. ఇందుకోసం వళ్ళూవర్ కోట్టంలో ప్రత్యేక సెట్ నిర్మించి, అందులో ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేశారు. డాన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రంలో శివకార్తికేయన్, రవి మోహన్, అధర్వ మురళి, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషించగా సుధా కొంగర దర్శకత్వం వహించారు.
అయితే, 1960 చరిత్ర నేపథ్యంలో తమిళుల గొప్పతనాన్ని తెలిపేలా సినిమాను దర్శకురాలు రూపొందించారు. ఇందుకోసం 60లో ఉపయోగించిన కార్లు, రైలు, రైల్వే స్టేషన్, ఆ కాలంనాటి వస్తువులు, సామగ్రిని సెట్లో ప్రదర్శనకు ఉంచారు. మూడు రోజుల పాటు ఆదివారం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. కథానుగుణంగా, కాలానికి సంబంధించి అరవింద్ అశోక్ కుమార్ ఈ సెట్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మరోవైపు, మూవీ ఆడియో రిలీజ్ వేడుకలో చిత్ర బృందంతో పాటు సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్, ఇతర సాంకేతిక నిపుణులంతా పాల్గొన్నారు.

సుధా కొంగర మాట్లాడుతూ 'సినిమాల ద్వారా జీవితంలోని ప్రతి అంశంలోనూ జీవించగలం. ఇది నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో చారిత్రక కాలంలోకి అడుగుపెడతాం. మన హక్కుల కోసం మనం పోరాడాలి అనే ఆలోచన నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. అలనాటి చారిత్రక ప్రపంచాన్ని తిరిగి తీసుకునిరావడానికి అన్ని విధాలా ప్రయత్నించాం. ఇందుకోసం ఆ కాలాన్ని తిరిగి సృష్టించాం. సినిమా చూస్తున్నంత సేపు 1960లో జీవించినట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా నచ్చుతుంది’ అని పేర్కొన్నారు.
శివ కార్తికేయన్ మాట్లాడుతూ 'నేను ఈ సినిమా చేయడానికి కథ కారణం కాదు, సుధా కొంగర మీదున్న నమ్మకం. సినిమా చేయాలని డిసైడ్ అయ్యాక కూడా కథ వినలేదు. ఈ సినిమా కోసం డైరెక్టర్ సుధా ఐదేళ్లుగా కష్టపడుతోంది' అని అన్నారు.