Ilayaraja: చెన్నైలో.. ఇళయరాజా సింఫనీ ప్రదర్శన! ఎప్పుడంటే

ABN , Publish Date - Jun 03 , 2025 | 01:38 PM

పుట్టిన రోజు సందర్భంగా ఇళయరాజా శుభవార్త చెప్పారు. త్వ‌ర‌లో చెన్నైలో సింఫనీ ప్ర‌ద‌ర్శ‌ణ ఉండ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ilaya raja

‘ఇసైజ్ఞాని’ ఇళయరాజా (Ilaiyaraaja) తన పుట్టిన రోజు వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. కోడం బాక్కంలోని ఇళయరాజా స్టూడియోలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు, త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇళయరాజా మీడియాతో మాట్లాడుతూ, ‘పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి జగ్దీష్‌ ధన్కర్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ముఖ్యమంత్రి స్టాలిన్‌ తదితర సినీ రాజకీయ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు.

అయితే.. తన పుట్టిన రోజు సందర్భంగా ఇళయరాజా శుభవార్త చెప్పారు. లండన్‌లో సింఫనీ అరంగేట్రం చేశాను. దాన్ని ఇక్కడ ఉండే వారు చూడలేక పోయారు. అందువల్ల లండన్‌కు చెందిన రాయల్‌ వాయిద్య కళాకారుల బృందాన్ని ఇక్కడకు పిలిపించి, ఆగస్టు 2వ తేదీ మరోమారు సింఫనీ పదర్శించనున్నాను. నా నిర్ణయానికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభినందిస్తూ స్వాగతించారు. నేను స్వరపరిచిన పాటలన్నీ ఎలాంటి వాతావరణం, పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆలకించవచ్చు. నా పాటలు వింటుంటే మద్యం లేకుండానే మత్తులోకి జారుకోవచ్చు’ అని పేర్కొన్నారు.

ఇదిలావుంటే, ఇళయరాజాను కలిసి బర్త్‌డే విషెస్‌ చెప్పిన వీసీకే ప్రధాన కార్యదర్శి తోల్‌ తిరుమావళవన్‌ మాట్లాడుతూ, ఇళయరాజాకు భారతరత్న ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. ఇపుడు మరోమారు విఙ్ఞప్తి చేస్తున్నారు. త్వరలోనే ఈ కోరికను కేంద్రం నెరవేర్చుతుందని గట్టిగా నమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు. వాస్తవంగా ఇళయరాజా పుట్టిన తేదీ జూన్‌ 3. అదే రోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి జన్మదినం కావడంతో ఇళయరాజా తన పుట్టిన రోజు వేడుకలను ఒక రోజు ముందు జరుపుకోవడం ప్రారంభించారు. దీనికి కారణం.. ఇళయరాజాకు ‘ఇసైఙ్ఞాని’ అనే బిరుదును కరుణానిధి బహుకరించడమే కారణం

Updated Date - Jun 03 , 2025 | 01:38 PM