Ilaiyaraaja: కుమార్తె పేరుతో.. ఇళయరాజా కొత్త ‘ఆర్కెస్ట్రా’
ABN , Publish Date - Nov 04 , 2025 | 10:10 AM
కుమార్తె భావతరణి స్మారకార్థం ‘భవత మహిళా ఆర్కెస్ట్రా’ ఏర్పాటు చేయనున్నట్లు ఇళయరాజా ప్రకటించారు.
సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన ఇసైజ్ఞాని ఇళయరాజా కుమార్తె భావతరణి కూడా అభిమానులను సంపాదించుకుంది. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ‘రాచప్ప’ చిత్రంలో ‘మస్తానా.. మస్తానా’ పాటతో భావతరణి సినీ పరిశ్రమకు పరిచయమైంది. అలాగే, ‘అనేకన్’; ‘ఇరుంబు కుదిరై’, ‘బిరియానీ’, ‘మంగాత్తా’, ‘ఫ్రెండ్స్’, ‘నేరుక్కునేర్’ సహా పలు చిత్రాల్లో ఆమె పాడిన పాటలు హిట్గా నిలిచాయి.
ఇళయరాజా సంగీత దర్శకత్వంలో విడుదలైన ‘భారతి’ చిత్రంలో ‘మయిలై పోల పొన్ను ఒన్ను..’ అనే పాట ఆమెకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. కొన్ని చిత్రాలకు ఆమె సంగీత దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో, గత ఏడాది జనవరిలో కాన్సర్ కారణంగా ఆమె మృతిచెందారు.

ఏఐ ద్వారా ‘ది గోట్’ చిత్రంలో భవతరణి స్వరం వినియోగించడంతో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం, తన కుమార్తె స్మారకార్ధం ‘భవత మహిళా ఆర్కెస్ట్రా’ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టినట్లు, మహిళా గాయకులు, సంగీత కళాకారులు తనను సంప్రదించవచ్చని ఇళయారాజా విజ్ఞప్తి చేశారు.