ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా ‘కైమేరా’

ABN , Publish Date - Jun 19 , 2025 | 08:20 PM

సైన్స్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ మూవీగా ‘కైమేరా’ పేరుతో ఓ చిత్రం రూపొందింది.

Chimera

సైన్స్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ మూవీగా ‘కైమేరా’ పేరుతో ఓ చిత్రం రూపొందింది. దీన్ని పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చేయనున్నారు. ‘సెల్ఫిష్‌’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన మాణిక్‌ జై ఎన్‌. డైరెక్షన్‌లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు సొంతంగా నిర్మించారు. ఎల్‌ఎన్‌టీ యతీష్‌ హీరోగా నటించగా, వైవిధ్యభరితమైన పాత్రలో తారై కృష్ణన్‌, రంజిత్‌ కుమార్‌, మాణిక్‌ జై నటించారు.

హీరోయిన్లుగా సౌమ్య, కృష్ణ నందు, ఙ్ఞానేశ్వరి నటించారు. మానవ శరీరంలోకి జంతు కణాలను ఇంజెక్ట్‌ చేయడం వల్ల మనిషి ఎలా మారుతాడనే కాన్సెప్టుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ కథ బెంగళూరు చుట్టూ సాగుతున్నందున షూటింగ్‌ కూడా బెంగళూరు, హంపి తదితర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాణిక్‌ జై మాట్లాడుతూ, ‘ఇది ఒక శాస్త్రీయ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ.

ఇప్పటివరకు ఎవరూ చెప్పని కోణంలో రూపొందిస్తున్నాం. సినిమాలో కామెడీ కూడా ఉంది. అందువల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చేలా రూపొందించాం. ఈ మూవీ ఏ భాషలో విడుదల చేసినా ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. అందుకే పాన్‌ ఇండియా స్థాయిలో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రిలీజ్‌ చేయనున్నాం’ అని తెలిపారు.

Updated Date - Jun 19 , 2025 | 08:20 PM